తూర్పుగోదావరి జిల్లాలో వైసిపికి షాక్ తగిలుతుందా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేత, కాకినాడ పార్లమెంటుకు పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ పార్టీకి రాజీనామా చేయటం ఖాయమని సమాచారం. సునీల్ ఆర్దికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యంపార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత వైసిపిలోకి మారారు. అప్పటి నుండి బాగా యాక్టివ్ గా నే ఉన్నారు.
స్ధానిక నాయకత్వంతో సమస్యలు
మొన్నటి జగన్ పాదయాత్రలో కూడా బాగానే తిరిగారు. కాకినాడ ప్రాంత వ్యక్తే కావటంతో స్దానికంగా కూడా కొంత పట్టుంది. అయితే పార్టీలోని స్ధానిక నాయకత్వంతో తలెత్తిన విభదాల కారణంగానే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎంపిగా టిక్కెట్టు విషయంలో కూడా జగన్ నుండి హామీ రాలేదట. పార్టీ మారాలని అనుకోవటానికి అది కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
ఏ పార్టీలో చేరుతారో ?
అదే సమయంలో సునీల్ పరిస్ధితిని గమనించిన తెలుగుదేశంపార్టీ, జనసేనపార్టీల నేతలు సునీల్ ను పార్టీల్లోకి చేర్చుకోవటానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. చాలా కాలంగా టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకనో సునీల్ సానుకూలంగా స్పందించటం లేదు. ఇపుడు జనసేన నేతలు కూడా రంగంలోకి దిగారు. సునీల్ తో టచ్ లో ఉన్నారు. మరి సునీల్ ఏ పార్టీలో చేరుతారో చూడాల్సిందే.