మామూలుగా ఏ ప్రభుత్వ పనితీరుపైనైనా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయంటే ఆ శాఖ పనితీరు ఏమీ బావోలేదనే అర్ధం. అదే ఎక్కవ శాఖల పనితీరుపై ఫిర్యాదులు ఎక్కవగా వినిపిస్తున్నాయంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేయటం లేదని అర్ధం. కానీ విచిత్రంగా కోట్ల కొద్దీ ఫిర్యాదులు రావటాన్ని కూడా ఘనతగా చెప్పుకోవటమంటే నిజంగా సిగ్గుచేటే. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ఫోన్ కాల్ 1100కు కోట్ల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుగుదేశంపార్టీకి మద్దతిచ్చే మీడియానే ప్రముఖంగా ప్రకటించింది. కాకపోతే ఆ మీడియాలో 40 కోట్ల ఫోన్ కాల్స్ వచ్చాయంటే కాల్ సెంటర్ల చరిత్రలోనే రికార్డంటూ రాసింది. ఫిర్యాదుల కోసం చేసే ఫోన్ కాల్స్ ను కూడా రికార్డుగా చెప్పుకుంటున్నారంటే చంద్రబాబుకున్న పైత్యం ఆ మీడియాకు బాగా ఎక్కేసినట్లుంది.
98శాతం పరిష్కారమయ్యాయా ?
మామూలుగా అయితే ఫిర్యాదుల కోసం ఉద్దేశించిన కాల్ సెంటర్లకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే అన్ని సమస్యలున్నట్లు లెక్క. సమస్యల కోసం కాల్ సెంటర్లు పెట్టారే కానీ ఆ సమస్యల పరిష్కారం ఏ మైందని మాత్రం మీడియా చెప్పలేదు. ప్రజల నుండి ఏడాదిలో 16.33 లక్షల ఫిర్యాదులు వస్తే 98 శాతం పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంటోందని మాత్రమే చెప్పింది. అంతేకానీ నిజంగా పరిష్కారమైన సమస్యలెన్నో మాత్రం సదరు మీడియా చెప్పలేదు. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం గృహనిర్మాణం కోసం వచ్చినవేనట. మరి ఫిర్యాదు చేసిన వాళ్ళల్లో ఎంతమందికి గృహాలు కట్టించి ఇచ్చారో మాత్రం చెప్పలేదు. ప్రభుత్వం చెబుతున్న 98 శాతం సమస్యలు పరిష్కారమే నిజమైతే 98 శాతం మందికి గృహాలు కట్టించి ఉండాలి కదా ?
40 కోట్ల ఫిర్యాదలంటే సిగ్గు పడాలి
కాల్ సెంటర్ పెట్టిన ఏడాదిలోనే 40 కోట్ల ఫిర్యాదులొచ్చాయంటే ప్రభుత్వం నిజంగానే సిగ్గుపడాలి. కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్ కాల్స్ తగ్గుతున్నాయంటే సమస్యలు పరిష్కారమవుతున్నట్లు లెక్క. అంతే కానీ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నాయంటే సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయనో లేకపోతే సమస్యలు పెరుగుతున్నాయనే అర్ధం కదా ? ప్రభుత్వ పనితీరు ఎలాగుందంటే బాగుందని ఒక నెంబర్, బావోలేకపోతే మరో నెంబర్ నొక్కమని ఐవిఆర్ఎస్ ద్వారా అడుగుతున్నారట. ట్రాఫిక్ సమస్యల్లో ఉండి సరైన సమాధానాలు చెప్పలేక సంతృప్తిగా ఉన్నామనే నెంబర్ ను జనాలు నొక్కేస్తున్నట్లు మళ్ళీ అదే మీడియా చెప్పింది. జనాల్లో సంతృప్తస్ధాయి 90 శాతం కనబడాలని చంద్రబాబు చెబుతుంటే అధికారులేమో సమస్యలను 98 శాతం పరిష్కరించినట్లు చెబుతున్నారు.' యథారాజా తథా ఉన్నతోద్యోగి ' అంటే ఇదేనేమో ?