చంద్ర బాబు సభలో కొంత మంది యువకులు రాజ్యాంగా బద్దంగా తమ నిరసనను తెలియజేస్తే దేశ ద్రోహులని ముద్ర వేసి అరెస్ట్ చేశారు దీనితో ముస్లిం ప్రజలు భగ్గుమన్నారు. ప్రశ్నించిన ముస్లిం యువత... పోలీసులు, పాలకులు చెబుతున్నట్టు వైసీపీకి చెందిన వారే అనుకొందాం. ముందుగా వారు ఈ రాష్ర్ట పౌరులనే విషయాన్ని వారు గుర్తించుకోవాలి. ఓట్లు వేయించుకునేందుకు ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇవ్వడం టీడీపీకి సర్వసాధారణం కావచ్చు.
బహుశా అవే తెలివితేటలని సంబరపడిపోతుండవచ్చు. ముస్లింల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ, ముస్లిం యువతలో కొండెంత నమ్మకం, బతుకుపై ఆశ కలిగించి ఉండొచ్చు. అందులోనూ కరవు ప్రాంత బిడ్డల్లో. మళ్లీ ఎన్నికలు వస్తున్నా నయాపైసా ఉపయోగం లేకపోవడంతో ఆ ఆశ, నమ్మకాల నుంచే ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రశ్నల రూపంలో, ప్లకార్డుల సాక్షిగా మీ వంచనను గుర్తుచేసింది.
ఇలా మీరు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు నోచుకోకపోవడం వారి జీవితాల్లో వంచనకు గురయ్యామనే ఆవేదన అగ్ని పర్వతంలా గూడుకట్టుకొంది. దాని ఫలితమే గుంటూరు సభలో ఎనిమిది మంది ముస్లిం యువత లావాల పెల్లుబికిన నిరసన బావుటా. ముస్లిం మనోభావాలకు ఆ ఎనిమిది మంది నిరసన గళాలే నిదర్శనం. లాఠీతో ముస్లిం యువతపై దౌర్జన్యం చేసి వారి మనసులను తీవ్రంగా గాయపరిచారు. ఇది ఎప్పటికీ వారి హృదయాల్లో నుంచి చెరగిపోదు. కాని లాఠీ కంటే ఓటు బలమైన ఆయుధం. ఓటు దెబ్బకు మహామహుల రాజకీయ జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. తమ మనోభావాలను కించపరచిన పాలకులపై రానున్న ఎన్నికల్లో ముస్లింలు ఓటు అనే లాఠీతో చావబాదేందుకు సిద్ధంగా ఉన్నారు.