జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా సీఎం అవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు ఇప్పటికే రాష్ట్రం అంతా పాదయాత్ర పూర్తి చేయబోతున్నాడు. అయితే రాష్ట్రం లో ఇన్ని సమస్యలు ఉన్న వైసీపీ పెద్దగా పోరాటం చేయడం లేదు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధిపొందే అవకాశాన్ని జగన్, వైసీపీ చేజేతులా జారవిడుచుకుంటున్నట్టనిపిస్తోంది. నిన్నటికి నిన్న విజయనగరం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే రాజన్న ప్రభుత్వంతో పాటు సొంత పార్టీ నిర్లక్ష్యంపై ఘాటైన వ్యాఖ్యలు చేయడమే నిదర్శనం.
ప్రజారోగ్యం కాపాడలేని చంద్రబాబు ప్రభుత్వంపై తన పార్టీ పోరాడటం లేదని, నిద్రమత్తులో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీన్నిబట్టి ఎమ్మెల్యే స్థాయిలోనే వైసీపీ పోరాట పంథాపై వ్యతిరేకత ఉంటే ప్రజాభిప్రాయం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?. నంద్యాలకు చెందిన ముస్లిం యువతపై దేశద్రోహ కేసుపెడితే ప్రతిపక్ష వైసీపీ చేసిన పోరాటం ఏంటి? "మీరిచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజాస్వామ్యయుతంగా అడగడం తప్పా.
తక్షణం ఆ యువకులపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకుని వారికి క్షమాపణ చెప్పాలి " అని ట్విటర్ వేదికగా జగన్ డిమాండ్ చేశారు. ఏంటీ ట్విటర్ డిమాండ్. దేశ ద్రోహ కేసుపెట్టినా ప్రతిపక్ష పార్టీలో స్పందన లేదా? బాబు సర్కార్ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా రాష్ర్ట వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించి బాధితులకు తానున్నాననే భరోసా కల్పించాల్సిన జగన్, ఆ పని చేయలేదు.