మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని అనిపిస్తోంది. ఎందుకంటే, నియోజకవర్గంలోని చాలా సామాజికవర్గాల్లో మంత్రి వ్యవహారశైలిపై వ్యతిరేకత పెరిగిపోతోంది. అసలే, ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత. దానికితోడు పార్టీలోనే కాకుండా నియోజకవర్గంలో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందట. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసిపి చొచ్చుకుపోతోంది. అందులోనూ ఈ మధ్యే వైసిపిలో చేరిన మహిళా నేత విడదల రజనీ జనాల్లో దూసుకుపోతుండటంతో ప్రత్తిపాటికి చెమటలు పట్టిస్తున్నారని సమాచారం.
ప్రత్తిపాటిపై పెరిగిపోతున్న వ్యతిరేకత
ఇంతకీ విషయం ఏమిటంటే, నియోజకవర్గంలో ప్రత్తిపాటి మూడోసారి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో గెలవగానే సమీకరణల కారణంగా ప్రత్తిపాటి మంత్రి కూడా అయిపోయారు. అసలే కరువుతో అల్లాడుతున్నారు. ఎందుకంటే, ప్రతి పక్షంలో పదేళ్ళుగా ఉన్నారు. దాంతో మంత్రవ్వగానే గేట్లు తెరిచేశారట. దాంతో ప్రత్తిపాటిపై విపరీతమైన అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో ప్రత్తిపాటిని డ్రాప్ చేయాలని చంద్రబాబునాయుడు అనుకున్నా ఏదో అదృష్టం కారణంగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయినా వ్యవహార శైలిలో మార్పు కనబడలేదట. దాంతో ప్రత్తిపాటిపై వ్యతిరేకత పెరిగిపోతోంది.
దూసుకుపోతున్న విడదల
అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎంఎల్ఏ, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ దూసుకుపోతున్నారు. ప్రత్తిపాటి వ్యతిరేకులందరినీ కలుపుకుని పోతున్నారు. దాంతో నియోజకవర్గంలోని చాలా మంది నేతలు మర్రికి మద్దతుగా నిలబడ్డారు. అయితే, ఈమధ్య కాలంలో మర్రి అనారోగ్యంతో మునుపటిలా దూసుకుపోలేకపోతున్నట్లు సమాచారం. అదే సమయంలో పారిశ్రామికవేత్త, మహిళా నేత అందులోనూ ఆర్ధికంగా పటిష్ట స్ధితిలో ఉన్న విడదల రజని వైసిపిలో చేరారు. చేరటం చేరటమే నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దాంతో నేతల్లో, శ్రేణుల్లో కొత్త జోష్ కనబడుతోంది.
టిడిపిలో కుదరదని వైసిపిలో చేరిన విడదల
ఇక్కడ విషయం ఏమిటంటే, రజనీ ఏపి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా, విఆర్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో కొంత కాలంగా జనాల్లో తిరుగుతున్నారు. దాంతో నియోజకవర్గంలో బాగా పరిచయం సంపాదించుకున్నారు. అసలు రజనీ రాజకీయ ప్రవేశమే టిడిపితో మొదలైంది. ఎలాగంటే మంత్రే రజనీని చంద్రబాబునాయుడుకు పరిచయం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే టిడిపిలో చేరారు. అయితే ప్రత్తిపాటి ఉండగా టిక్కెట్టు సాధ్యం కాదని గ్రహించిన వెంటనే వైసిపిలో చేరిపోయారు.
రెండేళ్ళుగా నియోజకవర్గంలో తిరుగుతున్న రజనీ
ఎప్పుడైతే రజనీ వైసిపిలో చేరారో ముందు కాస్త వ్యతిరేకత వచ్చింది. అయితే, తర్వాత కొందరు నేతలను రజనీ సమన్వయం చేసుకోవటంతో వ్యతిరేకత తగ్గింది. అందుకే నియోజకవర్గానికి రజనీనే సమన్వయకర్తగా జగన్ ప్రకటించారు. వైసిపిలో చేరక ముందునుండే నేతలతో మంచి సంబంధాలున్న కారణంగా ఇపుడు మరింత దూసుకుపోతున్నారు. వైసిపిలో కొత్త జోష్ కారణంగా ప్రత్తిపాటికి చెమటలు పడుతోందని సమాచారం. మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రజనీకి జగన్ టిక్కెట్లు ఇచ్చేది లేంది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.