తెలుగుదేశంపార్టీ గ్రాఫ్ పడిపోతోందా ? అవుననే అంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు. బిజెపి-టిడిపి పొత్తున్నపుడు కూడా రాజుగారు తన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుండేవారు. ఇపుడు హటాత్తుగా టిడిపి గ్రాఫ్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గుండాల రాష్ట్రంగా మారిపోయిందంటూ మండిపడ్డారు. ఆయన ఉద్దేశ్యం టిడిపి నేతలే అధికారులతో పాటు వైసిపి నేతలపై దాడులు చేయటం గురించేనేమో ? అయితే, ఆ విషయం స్పష్టంగా చెప్పలేదు లేండి.
టిడిపి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు రాజుగారు ఆరోపించారు. నాలుగేళ్ళల్లో ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా పని చేసింది లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ వ్యవస్దనూ దానిపని దానిని చేసుకోనివ్వటం లేదు టిడిపి నేతలు. అన్నింటిని గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నారు. అందుకనే పార్టీ పరంగా అరాచకం పెరిగిపోతోంది.
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందంటూ రాజు చెప్పటం గమనార్హం. చంద్రబాబునాయుడు చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే టిడిపి గ్రాఫ్ పడిపోతోందట. మరి 24 మంది మంత్రుల్లో ఎవరి వల్ల అని అడిగితే ఆ విషయం మాత్రం చెప్పలేదు. మంత్రుల్లో ఆరోపణలు లేనివి ఎవరిపైన ? ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఆరోపణను ఎదుర్కొంటున్న వారే కదా ? పొత్తులు విడిపోయినా విష్ణుకుమార్ రాజు మాత్రం ముఖ్యమంత్రిని తరచూ కలుస్తూనే ఉన్నారు. కాబట్టి టిడిపి గ్రాఫ్ పడిపోతోందని చెప్పటంలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కదా ?