చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ప్రతిదీ గోప్యమే. చెప్పేదేమో పారదరద్శక పాలన.. ఆచరణలో మాత్రం అంతా రహస్యమే. తాజాగా రాజధాని నిర్మాణానికి అమరావతి బాండ్ల కొనుగోలు వ్యవహారం కూడా అలాగే తయారైంది. బాండ్లు జారీ చేసిన గంటలోనే ఒకటిన్నర రెట్లు ఓవర్ సబస్క్రైబ్ అయ్యిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళ పేర్లు మాత్రం చెప్పటానికి ఇంతకాలం ఇష్ట పడటం లేదు. అయితే, అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా కొందరి పేర్లను మాత్రం తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.
రూ. 2 వేల కోట్లు ఐదుమందే కొన్నారు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ, బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళల్లో ఐదుగురి పేర్లను మాత్రం బహిర్గతం చేశారు. బాండ్లలో 59 మంది పెట్టుబడి పెట్టారట. అందులో 95 శాతం బాండ్లను 9 మంది చేజిక్కించుకున్నారట. అంటే ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్లలో 95 శాతం కేవలం 9 మంది వద్దే ఉన్నట్లు కుటుంబరావు అంగీకరించారు.
పూర్తి వివరాలు చెప్పేది లేదు
ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, ఆదిత్యబిర్ల, ఏకె ఫైనాన్స్ సంస్దతో పాటు మాలీ, షేత్ ఫ్యామిలి వంటి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టినట్లు మొత్తానికి చెప్పారు. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపికి సంబంధం ఉన్న వాళ్ళతోనే చంద్రబాబునాయుడు మొత్తం బాండ్లను కొనుగోలు చేయించారని పలువురు ఆరోపిస్తున్నారు. పై సంస్ధల్లో ఏ సంస్ధ ఎంత పెట్టుబడి పెట్టింది ? ఎవరి పేర్లతో కొనుగోలు చేసిందన్న వివరాలు మాత్రం చెప్పేది లేదంటున్నారు కుటుంబరావు. అందుకనే కొనుగోలుదారుల విషయంలో అందరిలోనూ అనుమానాలు అలాగే ఉండిపోయాయి. రాజధాని నిర్మాణానికి జారీ చేసిన అమరావతి బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలను ప్రభుత్వం ఎందుకంత గోప్యంగా ఉంచుతోందో అర్ధం కావటం లేదు.