ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నది ఓ సామెత. అచ్చంగా అలానే తయారయ్యేట్లుంది చంద్రబాబునాయుడు పరిస్ధితి. తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు పోవాలనేది కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది. మరి ముందస్తు ఎన్నికలకు వెళితే తెలంగాణా రాష్ట్ర పరిస్ధితి ఏమవుతుందన్నది వేరే సంగతి. ముందస్తు ఎన్నికలే గనుక నిజమైతే చంద్రబాబుకు మాత్రం ఇబ్బందులు తప్పవు. పొత్తుల విషయంలో తేల్చుకోలేకే బాగా ఇబ్బంది పడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అర్జంట్ మీటింగ్ పెట్టారు.
తెలంగాణాలో టిడిపి ఖాళీ
తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఏదో తెలంగాణాలో పార్టీ ఉందనిపుంచుకోవటానికి అడుగు బొడుగు నేతలు అప్పుడప్పుడు చప్పుడు చేస్తుంటారు. తెలంగాణాలో పార్టీని స్వయంగా చంద్రబాబే గాలికొదిలేశారంటే పరిస్దితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఏపిలో అధికారంలో ఉండటం కొంతలో కొంత నయమనే చెప్పుకోవాలి. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు ?
ఒంటరిపోరంటే భయమే
ఎందుకంటే, పొత్తులు పెట్టుకోకుండా చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేరు. చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవటానికి ఏ పార్టీ కూడా సిద్దంగా లేదు. అసలు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. కాబట్టి చంద్రబాబు ఆ దిశగానే చూస్తున్నారు. కాంగ్రెస్ కు కూడా పొత్తు అవసరమే. తెలంగాణాలో టిడిపి పరిస్దితేంటో, ఏపిలో కాంగ్రెస్ పరిస్ధితి సేమ్ టు సేమ్. కాబట్టే రెండు పార్టీలు పొత్తులకు సిద్ధమైపోతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి, చంద్రబాబు మధ్య నిర్ణయమైపోయిందని టాక్ నడుస్తోంది.
మంత్రుల రియాక్షన్ తో షాక్
చివరకు రెండు రాష్ట్రాల్లోను ఏ పార్టీకెన్ని సీట్లు అన్న విషయం కూడా డిసైడ్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి పొత్తుల విషయం బహిరంగంగా ప్రకటన కాలేదంతే. ఇటువంటి సమయంలోనే కెసిఆర్ హటాత్తుగా ముందస్తు రాగం అందుకున్నారు. ఒకవేళ ఈఏడాదిలోగా ఎన్నికలు జరగటం ఖాయమైతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, కాంగ్రెస్-టిడిపి పొత్తును టిడిపిలోని పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్న విషయం బయటపడింది. పొత్తులపై మంత్రులు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు రియాక్షన్ తో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది.
పొత్తుల విషయంపై క్లారిటీ ఇస్తారా ?
ఎన్నికల ముందు పొత్తులను బహిరంగంగా ప్రకటించి వ్యతిరేకిస్తున్న నేతలందరినీ మ్యానేజ్ చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ తెలంగాణాలో ముందస్తు ఎన్నికలంటే ఇప్పటికిప్పుడు పొత్తుల విషయాన్ని ప్రకటించాల్సిందే. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తంటే ఏపిలో కూడా పొత్తు తప్పదు. ఇప్పటికిప్పుడు పొత్తు విషయం బహిర్గతమైతే మంత్రులు, సీనియర్ నేతలు ఎవరెలా రియాక్టవుతారో తెలీక చంద్రబాబులో టెన్షన్ పట్టుకుంది. పొత్తును వ్యతిరేకించే వారు కన్వీన్స్ అయి టిడిపిలోనే ఉంటారా ? లేకపోతే బయటకు వెళ్ళిపోతారా ? అన్న విషయంలో టెన్షన్ పట్టుకుంది. అందుకనే ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు హడావుడిగా మీటింగ్ పెట్టారు. మరి ఏమవుతుందో చూడాలి.