వచ్చే ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా టిక్కెట్ల పంపిణీలో చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుమారుగా 6 మంది ఎంఎల్ఏలకు టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని సమాచారం. మరో ఇద్దరికి నియోజకవర్గాన్ని మార్చే విషయంతో పాటు ఓ ఎంపిని అసెంబ్లీకి పోటీ చేయించే విషయంపై చంద్రబాబు కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అవినీతితో పార్టీకి చెడ్డపేరు
టిక్కెట్లు దక్కని ఎంఎల్ఏలు కాకినాడ, అమలాపురం లోక్ సభ పరిధిలో ఉన్నట్లు సమాచారం. వారిపై అవినీతి ఆరోపణలు, లేకపోతే వారి తరపున కుటుంబీకులు చేస్తున్న దందాలతో పార్టీకి బాగా చెడ్డపేరొచ్చినట్లు చంద్రబాబుకు నివేదికలందాయి. అదే సమయంలో మరికొందరికి వయసు పైన బడటంతో పాటు జనాల్లో అంతగా సదభిప్రాయం లేకపోవటం కూడా అభ్యర్ధిని మార్చాలని నిర్ణయానికి మరో కారణంగా తెలుస్తోంది.
కుటుంబీకులదే దందాలన్నీ
కాకినాడ లోక్ సభ పరిధిలోని ప్రత్తిపాడు ఎంఎల్ఏ వరుపుల సుబ్బారావు స్దానంలో మరొకరిని పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారట. కారణం ఏమిటంటే సుబ్బారావుకు 75 ఏళ్ళు. వయసును కారణంగా చూపి ఆయన సోదరుని మనవడు రాజాకి టిక్కెట్టిస్తారని సమాచారం. ఇక కాకినాడ రూరల్ ఎంఎల్ఏ పిల్లి అనంతలక్ష్మి కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కారణంగా ఆమెకు టిక్కెట్టు దక్కే అవకాశాలు తక్కువని ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా కాకినాడ ఎంపి తోట నర్సింహంను ఎంఎల్ఏగా పోటీ చేయించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తోట త్వరలో వైసిపిలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతోంది.
గొల్లపల్లికి పార్టీ బాధ్యతలేనా ?
అమలాపురం లోక్ సభ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లలోని ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలున్నాయి. వీరిలో ముగ్గురికి టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరిని వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుండి పోటీ చేయిస్తారని సమాచారం. రూరల్ నియోజకవర్గంలో కొత్త అభ్యర్ధి కోసం చూస్తున్నారు. అలాగే, రాజోలు నియోజకవర్గం నుండి ఎంఎల్ఏ గొల్లపల్లి సూర్యారావును తప్పిస్తారని అంటున్నారు. ఈయనకు మరో రిజర్వుడు నియోజకవర్గం కేటాయిస్తారట. తేకపోతే పార్టీ బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోవక్కర్లేదని సమాచారం.
ఎంఎల్ఏల బలంపై చంద్రబాబు ఆరా
మొత్తం మీద ఆరుగురికి టిక్కెట్లలో కోత, ఇద్దరిని నియోజకవర్గం మార్చటం లాంటి అంశాలపై కసరత్తు దాదాపు పూర్తయిందని పార్టీ వర్గాలంటున్నాయి. మరి టిక్కెట్లు దక్కని వారు పార్టీ మారిపోతారా లేకపోతే పార్టీలోనే ఉండి ప్రత్యర్ధుల విజయానికి సాయం చేస్తారా ? అసలు టిక్కెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్న బలమెంత ? అన్న విషయాలపైన కూడా చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్నారట.