శాసనసభ రద్దు తర్వాత కెసిఆర్ మీడియాతో మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రతిపక్షాల పొత్తులపై భయపడుతున్నట్లే కనబడుతోంది. కెసిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్-టిడిపి పొత్తులను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించారు. రాజకీయాల్లో అందులోనూ ఎన్నికల సందర్భంలో పార్టీల మధ్య పొత్తులు అత్యంత సహజమే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కెసిఆర్ కు తెలియని విషయం కాదు. అయినా కాంగ్రెస్, టిడిపిల పొత్తును అత్యంత జుగుప్సాకారమని వర్ణించటమంటే
ఉద్దేశ్యపూర్వకంగానే కామెంట్ చేసినట్లు అర్ధమైపోతోంది.
కెసిఆర్ లో ఎందుకంత భయం
కెసిఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపిలు రెండు బలమైన పార్టీలే. ఆ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. ఏదో టైం బ్యాడ్ అవటం వల్ల తెలంగాణాలో టిడిపి బాగా దెబ్బతింది. తెలుగుదేశంపార్టీ నుండి నేతలైతే వెళ్ళిపోయారు కానీ క్యాడర్ మాత్ర చెక్కు చెదరకుండా పార్టీనే అంటిపెట్టుకునుంది. ఆ విషయం కెసిఆర్ కు కూడా బాగా తెలుసు. ఎంత తక్కువేసుకున్నా టిడిపికి ఇప్పటికీ 15 శాతం ఓటింగ్ అనుకూలంగానే ఉంది. సమైక్య రాష్ట్రాన్ని తీసుకుంటే ఏపిలో కన్నా తెలంగాణాలోనే టిడిపి బలంగా ఉండేది.
కాంగ్రెస్ పుంజుకుందా ?
ఇక కాంగ్రెస్ సంగతి చూస్తే పోయిన ఎన్నికల్లో కన్నా ఇపుడు కాస్త బలంగానే ఉన్నట్లు కనబడుతోంది. తెలంగాణాలో ఉద్యమ కాలంలో కాంగ్రెస్ లోనే ఉంటూ కెసిఆర్ కు అనుకూలంగా వ్యవహరించిన నేతల్లో చాలా మంది ఇపుడు టిఆర్ఎస్ లో చేరిపోయారు. కాబట్టిఇపుడు కోవర్టుల బెడద చాలా వరకూ తొలగిందనే అనుకోవాలి. అదే సమయంలో కెసిఆర్ అంటే పడని రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి లాంటి టిడిపి నేతల్లో చాలామంది కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి కాంగ్రెస్ బలంగానే కనబడుతోంది. ఎటూ క్యాడర్ ఉంది, ఓటు బ్యాంకూ ఉంది. కాబట్టి కాంగ్రెస్, టిడిపిలు కలిస్తే బలమైన ప్రతిపక్షం తయారవుతుందనే ప్రచారం జోరందుకుంది.
60 సీట్లలో ఇబ్బందులు తప్పవా ?
రెండు పార్టీల మధ్య పర్ఫెక్టుగా పొత్తులు కుదిరి ఓట్ ట్రాన్స్ ఫర్ గనుక పక్కాగా జరిగితే కెసిఆర్ కు చుక్కలు కనిపించటం ఖాయం. ఆ విషయం కెసియార్ కు కూడా తెలుసు గనుక పొత్తులపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతల అంచనా ప్రకారం ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అంటే సుమారు 60 సీట్లలో టిఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో టిఆర్ఎస్ సిట్టింగులపై వ్యతిరేకత కూడా తోడైతే వద్దన్నా టిడిపి, కాంగ్రెస్ అభ్యర్ధులకు బోనస్ ఓట్లు వస్తాయి.
జుగుప్సాకరమైతే అప్పుడెట్లా పొత్తులు పెట్టుకున్నారు ?
ఇక, కాంగ్రెస్-టిడిపి పొత్తు జుగుప్సాకరమని వ్యాఖ్యానించటంలో అర్ధమేలేదు. ఎందుకంటే, 2004 కాంగ్రెస్ తో కెసిఆర్ జత కట్టారు. 2009లో టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. నిజంగానే ఆ రెండు పార్టీల పొత్తు జుగుప్సాకరమైతే అప్పుడు రెండు పార్టీలతో పొత్తులెలా పెట్టుకున్నారు ? ఆంధ్రా పార్టీలకు నిజమైన తెలంగాణా బిడ్డలు గులాంగిరీ చేయరని అనటంలో కూడా అర్ధం లేదు. ఎందుకంటే, కెసిఆర్ రాజకీయ జీవితం మొదలైందే ఆ రెండు పార్టీలతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. తనలోని ఆందోళనను కప్పిప్పుచ్చుకునేందుకే జుగుప్సాకరమనే వ్యాఖ్యలు చేస్తున్నారని అనిపిస్తోంది.