కేసీఆర్ ఏది చేసినా ... పార్టీల మీద విమర్శలు చేసినా దానికొక లెక్కుంటుంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజున పెట్టిన మీడియా సమావేశంలో కాంగ్రెసును తీవ్రంగా విమర్శించారు. రాహుల్ను బఫూన్ అని, కాంగ్రెసు నెంబర్ ఒన్ విలన్ అని దుమ్మెత్తి పోశారు. చంద్రబాబును ఒకటి రెండు తిట్లు తిట్టారు. బీజేపీని ఏవో నాలుగు మాటలన్నారు తప్ప విరుచుకుపడలేదు. కమ్యూనిస్టులనుగాని, కోదండరామ్ పార్టీనిగాని ఏమనలేదు.
జగన్, పవన్ కళ్యాణ్ పార్టీల ఉనికి కూడా రాష్ట్రంలో లేదు కాబట్టి వాటి ఊసు ఎత్తలేదు. ఎంఐఎం తమకు మిత్రపక్షమని గట్టిగా చెప్పారు. దీనికంతా లెక్క ఉంది. టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొనేది కాంగ్రెసు పార్టీయేనని అభిప్రాయముంది. మాటలతో చేతలతో దాన్ని బలహీనం చేయాలనేది ఆయన ఉద్దేశం.
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసును లేవనీయకుండా చేయాలనేది కేసీఆర్, ప్రధాని మోదీ లక్ష్యం. అందుకే కాంగ్రెసు మీద విరుచుకుపడ్డారు. రాహుల్ను బఫూన్ అని, కాంగ్రెసును విలన్ అని చేసిన విమర్శలపై కాంగ్రెసు నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్ను తిట్టి పోస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెసు మరింత ధైర్యం కోల్పోయేలా చేయడానికి కొందరు నాయకులకు వలవేసి గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని పనిగట్టుకొని పార్టీలోకి ఆహ్వానించారు.