పైకి ధ్వేషం, లోపల మాత్రం అపారమైన ప్రేమ. ఇంత కాలం పైకి ధ్వేషాన్ని మాత్రమే చూపించిన సిపిఐ నేతలు సందర్భం రాగానే ప్రేమను కురిపించేందుకు సిద్దమైపోయారు. ఇంతకీ ప్రేమ-ధ్వేషమేంటని అనుకుంటున్నారు. ఏపిలో ఒకవైపు చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తు, విమర్శలు చేస్తూనే తెలంగాణాలో మాత్రం అదే చంద్రబాబుతో పొత్తులకు సిపిఐ సిద్ధపడిపోయింది. టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ఫోన్ చేయగానే సిపిఐ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వాలిపోయారు.
నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపిని సర్వనాశనం చేశాడని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిఎంను తిట్టని తిట్టులేదు. ప్రపంచబ్యాంకు జీతగాడని, చంద్రబాబు అవినీతిపై వేయని పుస్తకం లేదు. ఒకవైపు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తునే మరోవైపు బ్యాలెన్స్ చేయటం కోసమని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అవినీతిపరునిగా తిడుతుంటారు. ఎక్కడైనా ప్రతిపక్షం అధికారపక్షంపై ఆరోపణలు, విమర్శలు చేయటం మామూలే. కానీ ఏపిలో మాత్రం ప్రతిపక్షమైన సిపిఐ ప్రధాన ప్రతిపక్షమైన వైసిపిని కూడా తిడుతుంటుంది.
ఏపిలో సీన్ కట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తులు పెట్టుకోవటానికి సిపిఐ తహతహలాడిపోతోంది. ఏపిని చంద్రబాబు సర్వనాశనం చేశాడన్న విషయాన్ని పక్కనపెట్టేసి తెలంగాణాలో పొత్తుకు రెడీ అయిపోయింది. ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబుతో మరో రాష్ట్రంలో సిపిఐ పొత్తు ఎలా పెట్టుకుంటుంది ? చంద్రబాబుపై సిపిఐ ఆరోపణల్లో నిజాయితీ ఉంటే తెలంగాణాలో కూడా పొత్తుపెట్టుకోకూడదు. అయినా రాజకీయ పార్టీల్లో నిజాయితి, నేతి బీరకాయలో నెయ్యి ఆశించటం అత్యాసేనంటారా ?