తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ఖాయమైపోయాయి. టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ దూకుడు చూసిన తర్వాత మిగిలిన పార్టీలు కూడా ఆ దిశగానే కసరత్తులు చేయాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగానే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణా టిడిపి నేతలతో సమావేశం జరిపారు. అయితే, సుదీర్ఘంగా జరిపిన సమావేశం తర్వాత తేలిందేమిటంటే తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు కాడి దింపేశారని. అదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపి మంత్రి నారా లోకేష్ నేతృత్వమంటే టి నేతలు భయపడుతున్నట్లు సమాచారం.
తెరవెనుకే చంద్రబాబు
కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్న చంద్రబాబు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరపటానికి వెనకాడుతున్నారు. అదే సందర్భంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి అభ్యర్ధుల తరపున ప్రచారం చేయటానికి కూడా వెనకాడుతున్నారట. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పాత్ర దాదాపుగా తెరవెనుకకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
మరి స్టార్ క్యాంపెయినర్ ఎవరు ?
మరి ఈ దశలో టిడిపి తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఎవరుండాలనే ప్రశ్న తలెత్తిందట. తాను తెరవెనుకే ఉన్న ప్రచార బాధ్యతలు మొత్తాన్ని కొడుకు లోకేష్ చూసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారట. దాంతో లోకేష్ నేతృత్వాన్ని టి నేతలందరూ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా లోకేష్ వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో ప్రధానంగా ఆంధ్రా ఓటర్లున్న డివిజన్లలో టిడిపికి ఓట్లు రాలిపోతాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఒక్కటంటే ఒక్క డివిజన్లో కూడా టిడిపి గెలవలేదు.
జిహెచ్ఎంసిలో ప్రభావం శూన్యం
అదే విషయాన్ని టిడిపి నేతలు ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు. లోకేష్ వాక్చాతుర్యం ఏంటో టి నేతలకు కూడా బాగా తెలుసు. ఇప్పటికే ఎం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా సందర్భం కూడా చూసుకోకుండా మాట్లాడుతున్న మాటలతో లోకేష్ సర్వత్రా నవ్వుల పాలవుతున్నారు. ఏపిలోనే ఆయన ప్రభావం సూన్యమన్న విషయం తేలిపోయింది. అటువంటి లోకేష్ తెలంగాణాలో ప్రచారానికి వస్తే అంతే సంగతులు. ఆ విషయం గ్రహించే లోకేష్ విషయంలో టి నేతలు ముందు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అయితే, లోకేష్ వచ్చి ప్రచారం చేస్తానంటే టిడిపి అభ్యర్ధులు అప్పుడేం చేస్తారో తెలీదు.
ఏపిపై ప్రభావం పడకూడదనే
కెసిఆర్ కు భయపడే తెలంగాణా విషయంలో చంద్రబాబు వెనకాడుతున్నారన్న విషయం స్పష్టమైపోయింది. అదే సందర్భంలో తాను ప్రచారం చేసినా ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి అభ్యర్ధులు గెలవకపోతే దాని ప్రభవం ఏపి ఎన్నికల్లో ఉంటుందనే భయం కూడా చంద్రబాబును వెంటాడుతున్నట్లుంది. తెలంగాణాలో టిడిపి పరిస్ధితి నేలమట్టానికి పడిపోయిందన్న విషయం చంద్రబాబుకూ తెలుసు. అందుకనే ఏదో విధంగా కాంగ్రెస్ ను పట్టుకుని నాలుగు సీట్లన్నా సంపాదించాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి చంద్రబాబు ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.