ఒక్కోసారి ఎంత తెలివైన వాడిననుకున్న వాళ్ళు కూడా కాలానికి తలవంచక తప్పదు. ఇపుడదే పరిస్దితి చంద్రబాబునాయుడుకు ఎదురైంది. 2019 ఎన్నికలు కాదుకానీ చంద్రబాబు బాగా ఇరుక్కుపోయారు. ఏదో అదృష్టం కొద్ది కుడి, ఎడమల నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ ను పెట్టుకున్నందు వల్ల ముఖ్యమంత్రి అయిపోయారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమని కాంగ్రెస్ పైన, అవినీతి ఆరోపణలు జగన్ పై వేసేసి చంద్రబాబు సిఎం అయిపోయారు. అప్పట్లో రాష్ట్ర విభజన దగ్గర నుండి ఎన్నికల వరకూ రెండు కళ్ళ సిద్దాంతాన్ని ప్రవచిస్తు బయటపడిపోయారు.
వ్యతిరేకంగా ఉన్న పరిస్దితులు
అయితే అప్పటి పరిస్దితులు వచ్చే ఎన్నికల్లో ఉండవని తేలిపోయింది. అప్పట్లో చెప్పిన రెండు కళ్ళ సిద్దాంతం వచ్చే ఎన్నికల్లో వర్కవుటవ్వదు. దాంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇరుక్కోక తప్పదనే సంకేతాలు ఇపుడే కనబడుతున్నాయి. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యంలేక ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోవాల్సిన అనివార్యత. ఆ ఒక్కపార్టీనే కాంగ్రెస్ అయ్యింది. ఇపుడదే చంద్రబాబు కొంపముంచుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
తిట్టిన నోటితోనే కాంగ్రెస్ కు ప్రచారం
ఎన్డీఏలో ఉన్నంత కాలం నాలుగేళ్ళ పాటు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమంటూ కాంగ్రెస్ ను చంద్రబాబు తిట్టిన తిట్టుకుండా తిట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి పొత్తు ఖాయమని తేలిపోయింది. పొత్తుల విషయంలో పార్టీ నేతలను, జనాలను ఏ విధంగా ఒప్పించాలో అర్ధంకాక ఆందోళన పడుతున్నారు. ఇటువంటి నేపధ్యంలో హటాత్తుగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయ్.
తెలంగాణాలో మాత్రమే పొత్తా ?
తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఏపిలో కుదరదంటే కుదరదు. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కారణంగా కాంగ్రెస్ అభ్యర్ధులకు కూడా ప్రచారం చేయాల్సుంటుంది. రేపటి ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా కెసిఆర్ తో పాటు బిజెపిని కూడా టార్గెట్ చేయాల్సిందే. కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే ఇపుడు చంద్రబాబుకు నోరు పెగలటంలేదు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా కెసిఆర్ పై బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేయాలంటే చంద్రబాబు పరిస్దితేంటో చెప్పాల్సిన పనేలేదు. అలాగని అభ్యర్ధులకు ప్రచారం చేయకుండా ఉండలేరు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకే తెలంగాణాలో కూడా చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు నేతలు.
కెసియార్ ను విమర్శించే ధైర్యముందా ?
తెలంగాణాలో పరిస్ధితి ఇలాగుంటే ఏపిలో పరిస్దితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసి ఏపిలో పొత్తులేదన్న కారణంగా వ్యతిరేకంగా ప్రచారం చేయగలరా ? పోయిన ఎన్నికల్లో తెలంగాణాలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణాకు మొదటి ఓటు వేసిందే టిడిపి అంటూ చెప్పుకున్నారు. ఏపిలో ప్రచారానికి వచ్చేసరికి ఎవరినీ అడక్కుండానే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించేసిందని చెప్పటం అంరికీ తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు ఆటలు సాగాయి కానీ వచ్చే ఎన్నికల్లో సాధ్యం కాదు. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో జనాలను కాదు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తన మంత్రులను ఎలా కన్వీన్స్ చేస్తారో చూడాలి. అందుకే కాంగ్రెస్ తో పొత్తుల పేరుతో చంద్రబాబు బాగా ఇరుక్కుపోయారనే చెప్పాలి. మరి ఎలా బయటపడతారో చూడాల్సిందే.