తెలుగుదేశంపార్టీలో కొందరు నేతలున్నారు. అచ్చంగా ప్రతీరోజు ఏదో ఓ కారణంతో జగన్మోహన్ రెడ్డిని తిడుతునే ఉంటారు. జగన్ పై ఆధారపడి టిడిపిలో మనుగడ సాగిస్తున్న నేతల్లో వర్ల రామయ్య, బాబూ రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళున్నారు. చంద్రబాబునాయుడు కూడా అంతే అనుకోండి కానీ ఆయన స్వయానా సిఎం కదా ? ఇంతకీ విషయం ఏమిటంటే దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సంబంధం లేకపోయినా వెంటనే దాన్ని జగన్ కు ఆపాదించేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి తమ కసిని తీర్చుకుంటారు.
వసంత బెదిరింపు నిజమేనా ?
తాజాగా మైలవరంలో వైసిపి నేత వసంత నాగేశ్వరరావు ఓ పంచాయితీ కార్యదర్శి నర్సింహరావును ఫోన్లో దూషించారట. మంత్రి దేవినేనిని హత్య చేస్తామని బెదిరించారట. ఇంకేముంది టిడిపి నేతలకు పెద్ద లడ్డూయే దిరికేసింది. దేవినేనిని హత్య చేస్తానని వసంత బెదిరించారో లేదో తెలీదు. ఫోన్ చేసి మందలించానని మాత్రమే వసంత అంటున్నారు. సరే, మంత్రిని హత్య చేస్తానని వసంత అన్నారనే అనుకుందాం కాసేపు.
వివాదంలోకి జగన్ ను లాగిన టిడిపి
నర్సింహారావును బెదిరించినందుకు విషయం వసంత వరకే పరిమితం కావాలి. ఇందులో జగన్ కు ఏమి సంబంధం ? జగనేమన్నా మంత్రిని హత్య చేస్తానని బెదిరించమని వసంతకు చెప్పారా ? మోకాలికి బోడిగుండుకు ముడేయటం టిడిపి నేతలకు బాగా అలవాటే. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో వైజాగ్ లోక్ సభ లో జగన్ తల్లి విజయమ్మ ఓడిపోవటం, అప్పట్లో కడప గుండాలను దింపారట. ఇపుడు కూడా రాజధాని ప్రాంతంలోకి కడప గుండాలనే దింపుతున్నారట జగన్. తనకు నచ్చకపోయినా, ఎదురు తిరిగినా లేపేస్తారా ? అంటూ జగన్ పై స్వయంగా చంద్రబాబే మండిపడుతున్నారు.
జగన్ అసలు అసెంబ్లీకే రావట్లేదు కదా ?
అసెంబ్లీలో మంత్రి దేవినేనిని తాను చూడదలచుకోలేదని జగన్ చెప్పారట. అలాగ చెప్పటానికి ఆయనెవరంటూ చంద్రబాబు ధ్వజమెత్తటం విచిత్రంగా ఉంది. మంత్రిని అసెంబ్లీకి రావద్దని చెప్పటానికి జగన్ ఎవరంటూ నిలదీశారు ? జగన్ కు ఇష్టం లేని వాళ్ళు అసెంబ్లీకి రాకూడదా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించటం విడ్డూరంగా ఉంది. దేవినేని గురించి జగన్ అలా అన్నారో లేదో తెలీదు. ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే అసలు జగనే అసెంబ్లీని బహిష్కరించారు. జగనే అసెంబ్లీకి రానపుడు ఇక దేవినేని ప్రస్తావన ఎందుకు తెస్తారు ? మంత్రిని అసెంబ్లీకి రాకూడదని ప్రతిపక్ష నేత చెప్పగలరా ? ఒకవేళ అన్నా ప్రభుత్వం చూస్తు ఊరుకుంటుందా ?
కడుపునొప్పి తగ్గించుకుంటున్న నేతలు
ఎక్కడో పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ కు మైలవరంలో వసంత బెదిరింపులకు టిడిపి లింకు పెట్టి మరీ జగన్ ను తిడుతోంది. అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. వసంతను విమర్శిచంటం కాదు కావాల్సింది. జగన్ ను తిట్టి కసి తీర్చుకోవాలన్నదే లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరింది. టిడిపి నేతల కడుపు నొప్పీ తగ్గిపోయింది.