జనసేన అధినేత పవన్ ఇంతకాలం చెబుతున్నదానికి తాజాగా చేసిందానికి అసలు సంబంధమే లేదు. తనకు కులమన్నదే లేదని తాను అందరివాడినని ఇంతకాలం అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా టిక్కెట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసరికి బిసి సామాజికవర్గానికే మొదటి టిక్కెట్టు కేటాయిస్తున్నట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. పైగా బిసిల్లో శెట్టిబలిజకు చెందిన పితాని బాలకృష్ణకు మొదటి టిక్కెట్టిస్తున్నట్లు పవన్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే, టిక్కెట్టిచ్చేందుకు చెప్పిన కారణం మాత్రం మరీ చెత్తగా ఉంది.
మొదటి టిక్కెట్టు ప్రకటించిన పవన్
తూర్పు గోదావరి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పితాని బాలకృష్ణ ఈమధ్యే జనసేనలో చేరారు. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బాలకృష్ణకు తాజాగా పవన్ టిక్కెట్టు ప్రకటించారు. ఆ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేనను అన్నీ కులాలతోను భర్తీ చేస్తానని చెప్పారు. పార్టీ తరపున పవన్ ప్రకటించిన మొట్టమొదటి టిక్కెట్టునే కులం ఆధారంగా ప్రకటించటం విడ్డూరంగా ఉంది. పితానిది తనకు ఒకే కులమని అదే పోలీసు కులమని కలరింగ్ ఇచ్చుకుంటున్నా ఆ తర్వాత చెప్పిన కారణమే మరీ చెత్తగా ఉంది.
పితానికి నాగరాజుకు సంబంధమే లేదు
శెట్టిబలిజ కులానికి చెందిన బాలకృష్ణకు టిక్కెట్టు ప్రకటించటమంటే ఇటీవలే పాయకరావుపేటలో జనసేన ఫ్లెక్సీ కడుతూ మరణించిన బిసి సామాజికవర్గానికి చెందిన తోలెం నాగరాజు ఆత్మకు శాంతి కలిగించటమే అని పవన్ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పితాని బాలకృష్ణకు తోలెం నాగరాజు బిసి సామాజికవర్గానికి చెందిన వారు కావటం తప్ప ఇంకే విధంగాను కనెక్షన్ లేదు. నాగరాజుది విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గమైతే పితానిది తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం.
పితానికి టిక్కెట్టిస్తే నాగరాజు ఆత్మ ఎలా శాంతిస్తుంది ?
పితానికి టిక్కెట్టు ఇస్తే పాయకరావుపేటకు చెందిన నాగరాజు ఆత్మకు శాంతి కలిగినట్లు ఎలా అవుతుంది ? నిజంగా నాగరాజు ఆత్మ శాంతించాలని పవన్ కు ఉంటే అతని కుటుంబంలోనే ఎవరికైనా టిక్కెట్టివ్వాలి. అంతే కానీ ఏమాత్రం సంబంధం లేని బాలకృష్ణకు టిక్కెట్టిస్తే నాగరాజు ఆత్మ ఎలా శాంతిస్తుంది ? పైగా నాగరాజు సామాజికవర్గానికి చెందిన పితానికి టిక్కెట్టని పవన్ చెప్పటంలో అర్ధమేంటి ? టిక్కెట్టివ్వటంలో సామాజికవర్గ కోణానికే పవన్ ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం స్పష్టమవుతోంది.
కులం లేదని చెబుతున్నదంతా ఉత్తిదేనా ?
నిజానికి ప్రస్తుత పరిస్దితుల్లో ఏ పార్టీ అయినా సామాజికవర్గాలను బట్టే టిక్కెట్లు కేటాయిస్తున్నాయి. అందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. సామాజికవర్గం బట్టి టిక్కెట్లు కేటాయించటం లేదని ఎవరైనా చెబితే నమ్మే వాళ్ళెవరు లేరు. పవన్ కూడా అందుకు అతీతుడేమీ కాడు. కాకపోతే మొదటి నుండి తనకు కులం లేదని, తానందరివాడినని చెప్పుకోవటంతోనే అందరికి అనుమానం వచ్చింది. ఇపుడా అనుమానమే నిజమైంది కూడా. చివరకు ప్రకటించిన మొదటి టిక్కెట్టులోనే సామాజికవర్గం కోణాన్ని పవన్ ప్రస్తావించటం గమనార్హం. అంటే పవన్ ఇంతకాలం చెబుతున్నదానికి తాజాగా చేసినదానికి ఏమీ సంబంధం లేదని స్పష్టమైపోయింది.