తెలంగాణ లో ఎన్నికలు జోరు మొదలవ్వడం తో అన్నీ పార్టీలు పొత్తులు గురించి తెగ కసరత్తు చేస్తున్నాయి. అయితే హైదరాబాదులో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలున్నాయి కాబట్టి, వారిలో టీడీపీ అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీని దెబ్బతీయగలితే కేసీఆర్కు ఎదురే ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ మీద, ప్రత్యేకించి చంద్రబాబు మీద దృష్టిపెట్టారు. తెలంగాణలో ప్రచారం చేయడానికి చంద్రబాబు జంకుతున్నా, ప్రత్యక్షంగా ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనడానికి భయపడుతున్నా కేసీఆర్ మాత్రం చంద్రబాబును వదలకూడదనుకుంటున్నారు.
టీడీపీ-కాంగ్రెసు కలయికను అపవిత్ర పొత్తుగా ప్రచారం చేస్తున్న కేసీఆర్ మరిన్ని అస్త్రాలను బయటకు తీయడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుకొని నిన్న మొన్నటివరకు కాంగ్రెసును చంద్రబాబు అనేకసార్లు తిట్టిపోశారు. సోనియాగాంధీని, రాహుల్ను వ్యక్తిగతంగా విమర్శించారు. ఈ చరిత్రంతా బయటకు తీసి ప్రచారం చేయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అలాగే కాంగ్రెసు నేతలు చంద్రబాబుపై చేసిన విమర్శలను బయటకు తీస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి చంద్రబాబు తనలో ముప్పయ్ శాతం కాంగ్రెసు రక్తముందన్న సంగతిని గుర్తు చేయబోతున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ బాబు చేసిన వాఖ్యలను, ఆంధ్రాలో సమైక్య ఉద్యమం సందర్భంగా చేసిన కామెంట్లను సేకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా స్థాపించారని, అదే పార్టీతో బాబు పొత్తు పెట్టుకొని ద్రోహం చేశారని ప్రచారం చేయాలనుకుంటున్నారు.