చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. తనకు సంబంధం లేకపోయినా ఎక్కడైనా మంచి జరిగితే తన గొప్పదనమని డప్పేసుకోవటం, అదే తన వైఫల్యాన్ని ప్రత్యర్ధుల ఖాతాలో వేసి బురదచల్లటం కూడా అందరికీ అనుభవమే. అటువంటిదే ఇపుడు ఓ విచిత్రమైన లాజిక్ ను ప్రకటించారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చేతులెత్తేసినట్లే అందిరలోను అనుమానాలు మొదలయ్యాయి.
అదో దండగ మారి వాక్
ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం పోలవరం గ్యాలరీ వాక్ అనే దండగమారి ఖర్చు ప్రోగ్రామ్ ను చంద్రబాబు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమానికి టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులందరూ వారి కుటుంబాలతో సహా రావాలంటూ ఆహ్వానించారు లేండి. వెళ్ళిన వారు వెళ్ళారు లేని వారు వెళ్ళలేదు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం వల్లే జాప్యం జరిగిందే కానీ తన వల్ల కాదట. పైగా ప్రాజెక్టును సంకల్ప బలంతో మొదలుపెట్టారని చెప్పటం మరీ విచిత్రంగా ఉంది. అప్పటికేదో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తానే ఆరభించినంత బిల్డప్ ఇస్తున్నారు. వైఎస్ హయాంలోనే చాలా పనులు జరిగిన విషయాన్ని అంగీకరించటాన్ని చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడటం లేదు.
పోలవరం పూర్తికాకపోతే జనాల వైఫల్యమట
కేంద్రం సహకరించి ఉంటే ఇంకా ఎంతో ముందుకెళ్ళే వారట. అయినా కానీ ప్రాజెక్టు పనులను వేగంగా జరుపుతున్నారట. అందుకు మీరంతా సహకరించాలని టిడిపి ప్రజా ప్రతినిధులను అడగటమే పెద్ద జోక్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంలో తాను విఫలమైతే అది 5 కోట్లమంది జనాలు పరాజయమట. అంతే కానీ ప్రతిపక్షాల విజయం కాబోదంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు చేతకానితనం వల్లే ప్రాజెక్టు పనులు నత్తనడక నడుస్తున్నాయన్న విషయం అందరికీ తెలుసు. ప్రాజెక్టు పూర్తయితే తన గొప్పతనమని, లేకపోతే జనాల పరాజయమని ఎంత తెలివిగా చెబుతున్నారో ? అంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేనని చేతులెత్తేసినట్లేనా ?