ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విషయంలో ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రింకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఎంపిలు, ఎంఎల్ఏలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులపై వెంటనే విచారణ జరిపించాలని సుప్రింకోర్టు నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకూ అసలు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా కేసులు నమోదవ్వటమే తక్కువ. నమోదైన కేసులపైన కూడా త్వరగా విచారణ జరిపించటం, తీర్పులు వెలువడటం, తీర్పులు అమలవ్వటం చాలా చాలా తక్కువనే చెప్పాలి.
కేసుల సంఖ్యపై తప్పుడు సమాచారం
ఆచరణలో ఈ పద్దతి మారాలన్న ఉద్దేశ్యంతో సుప్రింకోర్టు నడుం బిగించింది. అందుకే దేశవ్యాప్తంగా ఎంపిలు, ఎంఎల్ఏలపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను ఇమ్మంటు ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సందర్భంలో వివిధ కోర్టుల్లో విచారణల్లో ఉన్న కేసులను వెంటనే విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అందుకోసం ప్రతీ రాష్ట్రంలోని ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని డెడ్ లైన్ కూడా విధించింది.
ఏపిలో 25 మందిపైనే కేసులా ?
సుప్రింకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టులను ఏర్పాటు చేసి, సిబ్బందిని కూడా కేటాయించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే, కోర్టులను, జడ్జీలను, సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వాలు ఇప్పటికే వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను మాత్రం పూర్తిగా బదలి చేయలేదు. ఆ విషయంపైనే రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రింకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే, ప్రత్యేక కోర్టుకు ఏపి ప్రభుత్వం కేవలం 25 కేసులను మాత్రమే బదిలీచేసింది. పైగా అదే విషయాన్ని సుప్రింకోర్టుకు అఫిడవిట్ కూడా వేసింది. ఎంపిలు, ఎంఎల్ఏలపై కోర్టుల్లో 25 కేసులే ఉన్నాయా అంటూ విస్మయం వ్యక్తం చేయటం గమనార్హం. క్రమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపిలు, ఎంఎల్ఏల్లో 6 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నట్లు కేంద్రం ధర్మాసనానికి చెప్పటం కొసమెరుపు.