చంద్రబాబునాయుడుకు అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో పాటు మరో 15 మందికి అరెస్టు వారెంట్ జారీ చేయటం ఇపుడు సంచలనంగా మారింది. 2010లో అనుమతి లేకుండానే మహారాష్ట్రలోని బాబ్లి ప్రాజెక్టు సైట్ లోకి చంద్రబాబుతో పాటు టిడిపిలోని పలువురు ఎంపిలు ఎంఎల్ఏలు ప్రవేశించారు. దాంతో చంద్రబాబు తదితరులను మహారాష్ట్ర పోలీసులు వెంటనే అరెస్టు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అండ్ కోను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకోవటంతో పాటు పలువురు నేతలను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత అందరినీ అరెస్టు చేసి మూడు రోజుల పాటు పలు పోలీస్టేషన్లకు తిప్పారు. చివరకు అందరినీ ప్రత్యేక విమానంలో ఏపిలోకి తీసుకొచ్చి వదిలిపెట్టారు. అప్పటి నుండి చంద్రబాబు అండ్ కో పై మహారాష్ట్రలో కేసులు నడుస్తూనే ఉంది.
అప్పటి కేసులోనే ఇపుడు హటాత్తుగా చంద్రబాబుతో పాటు ఏపి, తెలంగాణాలోని 15 మంది నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయటం గమనార్హం. కేసుకు సంబంధించి ఈనెల 22వ తేదీ చంద్రబాబు కోర్టుకు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇదే విషయాన్ని లోకేష్ కూడా స్పష్టంగానే చెప్పారు. అయితే, ఇంతలోనే ధర్మాబాద్ న్యాయస్ధానం చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తెలంగాణాలో ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు తెరవెనుక నుండి కీలక పాత్ర పోషిస్తున్న నేపధ్యంలో అరెస్టు వారెంట్ జారీ అవ్వటం టిడిపికి పెద్ద షాక్ అనే చెప్పాలి.