తెలుగుదేశంపార్టీ దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు వ్యతిరేకంగా వైసిపి నేతలు ఈరోజు తిరగబడ్డారు. దాంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. చింతమనేని కి వ్యతిరేకంగా ఇంతకాలం నివురు గప్పిన నిప్పులాగున్న వ్యవహారం ఇపుడు బహిరంగంగా రచ్చకెక్కింది. చింతమనేని గురించి రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికీ పరిచయం అవసరం లేదు. ఎందుకంటే, టిడిపిలోని వివాదాస్పద ఎంఎల్ఏల్లో చింతమనేని అత్యంత వివాదాస్పద నేతగా బాగా ప్రచారంలో ఉన్నారు. బహుశా చింతమనేని చేస్తున్న ఆగడాలు చంద్రబాబు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయోమో తెలీదు ? ఏ దశలోను ఎంఎల్ఏని చంద్రబాబు కంట్రోల్ చేసిన దాఖలాల్లేవు.
ఇంతకీ విషయం ఏమిటంటే, నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా చింతమనేని ఆగడాలు మితిమీరిపోయాయి. అధికారులను తిడతాడు, కొడతాడు. నియోజకవర్గంలో తనను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై స్వయంగా దాడులు చేస్తాడు. ఎంఎల్ఏ ప్రధాన ఆదాయవనరు ఇసుక అక్రమ తవ్వకాలే. ఆ అక్రమ వ్యాపారాలపై ఇప్పటికే చాలా మంది అధికారులకు ఫిర్యాదులు చేసినా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. అదేక్రమంలో చింతమనేని అక్రమ దందాలపై వైసిపి నియోజకవర్గ సమన్వయ కర్త కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు ఫిర్యాదు చేశారు. అయితే విచిత్రమేమిటంటే అబ్బయ్య చౌదరితో పాటు మరో ఐదుమందిపైనే పోలీసులు రివర్స్ కేసులు పెట్టారు.
దాంతో నియోజకవర్గం వైసిపి నేతలకు ఒక్కసారిగా మండిపోయింది. చింతమనేని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతో ఈరోజు చింతమనేని ఇంటిముందే అబ్బయ్య చైదరి తదితరులు నిరాహారదీక్షకు దిగారు. అయితే, పోలీసులు దీక్షా శిబిరాలను తొలగించారు. దీక్షలో కూర్చున్న వారిని అరెస్టు చేశారు. ఇంతకాలం చింతమనేని విషయంలో అబ్బయ్య చౌదరి నేరుగా జోక్యం చేసుకోలేదు. ఒకవైపు చింతమనేనిపై పెరిగిపోతున్న వ్యతిరేకత, అదే సమయంలో అబ్బయ్యకు పెరుగుతున్న మద్దతు నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో చింతమనేనికి ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతోంది.