అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డికి తాజాగా ఓ ధర్మసందేహం వచ్చింది. ఇంతకీ పోలీసులది ఏ జాతి ? అని. సందేహానికి ఆయనే సమాధానం కూడా చెప్పాశారు లేండి. పోలీసులు హిజ్రా జాతికి చెందిన వాళ్ళట. ఇంతకీ పోలీసులపై జేసి అంతలా కామెంట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది ? ఏమొచ్చిందంటే, తాడిపత్రి నియోజకవర్గంలో చినపొలమాడ గ్రామముంది. తాడిపత్రి అనగానే జేసిల రాజ్యమన్న విషయం అందరికీ అర్ధమైపోయుంటుంది. ఆ నియోజకవర్గంలో ఏం జరగాలన్నా, ఏమీ జరగకూడదన్నా జేసిల అనుమతి కావాల్సిందే.
అటువంటిది గ్రామస్తులు గణేష్ నిమజ్జనం చేయాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అదే చివరకు జేసి పోలీసులపై విరుచుకుపడేలా చేసింది. గణేష్ నిమజ్జనం చేయాలంటే గ్రామంలోనే ఉన్న ప్రబోధానందాశ్రమం ముందు నుండే వెళ్ళాలి. తమ ఆశ్రమం ముందునుండి ట్రాక్టర్లను తీసుకెళ్ళటానికి ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించలేదు. అయినా సరే గ్రామస్తులు తీసుకెళ్ళే ప్రయత్నించటంతో వివాదం మొదలైంది. చివరకు వివాదం కాస్త పెద్దదైపోయి ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఆ కొట్టుకోవటంలోనే చుట్టుపక్కలున్న ఆస్తులు, మోటారు వాహనాలు, షాపుల్లో కొన్ని ధ్వసమయ్యాయి. ఇదంతా శనివారం జరిగింది.
విషయం తెలియగానే జేసి ఆదివారం గ్రామంలో వాలిపోయారు. ఎందుకంటే, గ్రామస్తుల్లో జేసి మద్దతుదారులున్నారట. గ్రామానికి రావటం రావటమే జేసి పోలీసులపై విరుచుకుపడ్డారు. ఆశ్రమ నిర్వాహకులు గ్రామస్తులపై దాడులు చేస్తుంటే ఏమి చేస్తున్నారంటూ పోలీసులపై బూతులు మొదలుపెట్టారు. ఆశ్రమంలో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్న వారిపై చర్యలు తీసుకోరా ? అంటూ నిలదీశారు. వెంటనే వారిని అరెస్టు చేయాలంటూ ఆదేశించారు. అయితే, పోలీసుల్లో కదలిక కనిపించలేదు. దాంతో మండిపోయిన జేసి మీరేజాతి వారంటూ పోలీసులపై మండిపడ్డారు. అంతేకాకుండా పోలీసులనే వారు హిజ్రాలంటూ బహిరంగంగానే ఎగతాళిగా మాట్లాడటం కొసమెరుపు.