చంద్ర బాబు హైదరాబాద్ ను వదిలి పెట్టి అమరావతి కి మారిన సంగతీ తెలిసిందే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెండుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోనే హైద్రాబాద్ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అయితే, 'మన పరిపాలన.. మన ఆత్మగౌరవం.. మన రాష్ట్రం..' అంటూ చంద్రబాబు, ఓటుకు నోటు కేసు తర్వాత, ఆంధ్రప్రదేశ్కి పారిపోయారన్నది ఓపెన్ సీక్రెట్. ఓటుకు నోటు కేసుకు విరుగుడుగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి.. ఏపీ కేంద్రంగా చంద్రబాబు రాజకీయాలు నడుపుతూ వచ్చారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో, అనూహ్యంగా 'బాబ్లీ ప్రాజెక్ట్ - టీడీపీ రగడ' తెరపైకి రావడం, ఆ కేసుని పట్టుకుని చంద్రబాబు హైద్రాబాద్ కేంద్రంగా మళ్ళీ రాజకీయంగా బలోపేతమవ్వాలనే ఆలోచన చేయడం.. ఇవన్నీ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సహా అన్ని వ్యవస్థల్నీ అమరావతితోపాటు, హైద్రాబాద్లోనూ మోహరించాలని చంద్రబాబు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీచేయడం వివాదాస్పదమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణలో ఏం పని.? అని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంటే, 'హైద్రాబాద్ పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని.. 2014 వరకు మాకు హైద్రాబాద్లో హక్కులున్నాయి..' అని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. హైద్రాబాద్ పేరుతో ఇంకోసారి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నా.. అది ఆంధ్రప్రదేశ్లో 'నెగెటివ్ ఇంపాక్ట్' చూపించబోతోంది.