హటాత్తుగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తలను మార్చేయటంతో అసంతృప్తి మొదలైంది. మొన్నటి వరకూ గుంటూరు లోక్ సభ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను అదే జిల్లాలోని నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం సమన్వకర్తగా నియమించటం ఇపుడు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుంటూరు నియోజకవర్గం సమన్వయకర్తగా దేవరాయులు బాగానే పనిచేస్తున్నారు. అన్నీ వర్గాలను కలుపుకుని వెళుతున్నారు. పైగా యువకుడు కూడా కావటంతో నియోజకవర్గం మొత్తం చురుకుగా తిరుగుతున్నారు.
దూసుకుపోతున్న దేవరాయలు
విజ్ఞాన్ విద్యా సంస్దల అధినేత కావటం కూడా లావుకు బాగా కలిసి వస్తోంది. పార్లమెంటు పరిధిలోని ఎంఎల్ఏలను, ఇతర నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీలో కూడా చొచ్చుకుపోతున్నారు. టిడిపి ఎంఎల్ఏ, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కు ధీటైన ప్రత్యర్దిగా అందరి చేత బ్రహ్మాండమని అనిపించకుంటున్నారు. మొన్నటి జగన్ పాదయాత్ర సందర్భంగా కూడా బాగా యాక్టివ్ గానే పాల్గొన్నారు.
హటాత్తుగా తప్పించిన జగన్
ప్రధాన ప్రతిపక్షం తరపున జనాల్లోకి బాగా చొచ్చుకుని వెళుతున్న శ్రీకృష్ణ దేవరాయలును హటాత్తుగా ఎందుకు తప్పించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. గుంటూరు నుండి నరసరావుపేటకు ఎందుకు మార్చారో కూడా ఎవరికీ తెలియటం లేదు. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గ ఇన్చార్జి కిలారు రోశయ్యను గుంటూరుకు సమన్వయకర్తగా నియమించారు. ఈ మార్పిడి తాత్కాలికమేనా ? ఎంతకాలం ఉంటుంది ? అసలెందుకు మార్చారు ? అన్న ప్రశ్నలకు వైసిపి నేతలు సమాధానాలు వెతుక్కుంటున్నారు.
పార్టీకి నష్టం కాదా ?
ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. ఇంకోవైపు సమన్వయకర్తలను మారుస్తున్నారు. ఇదే పద్దతిలో జగన్ వ్యవహరిస్తుంటే రేపటి ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందన్న విషయాన్ని గ్రహించారో లేదో అర్దం కావటం లేదు. పోయిన ఎన్నికల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో వైసిపి దెబ్బతినటానికి ఇటువంటి వైఖరే కారణమన్న విషయం అందరికీ తెలిసిందే.
పోయిన ఎన్నికల్లో ఏమైంది ?
కొన్ని నియోజకవర్గాల్లో చివరి నిముషం వరకూ అభ్యర్ధులను ప్రకటించలేదు. మరికొన్ని నియోజవకర్గాల్లో చివరి నిముషంలో అభ్యర్ధులను మార్చేశారు. ఒక సామాజికవర్గం ఓటర్లు ఎక్కువున్న చోట మరో సామాజికవర్గం అభ్యర్ధులను రంగంలోకి దింపారు. దాంతో చాలా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధులు ఓడిపోయారు. కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖ కుటుంబాల్లో శ్రీకృష్ణదేవరాయులు కుటుంబం కూడా ఒకటి. అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త కిలారు రోశయ్య కాపు సామాజికవర్గంకు చెందిన నేత. నరసరావుపేటలో కాపుల బలం బాగానే ఉంది. అటువంటిది కుండమార్పిడి లాగ ఇపుడు ఇద్దరినీ అటు ఇటుగా మార్చేయటంతో నేతల్లో అయోమయం మొదలైంది. మొత్తానికి ఈ గందరగోళం ఎక్కడికి దారితీస్తుందో ఏమో ?