విశాఖపట్నం లోక్ సభ స్ధానానికి వైసిపి తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారా . పార్టీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం అందుకు అవకాశాలు ఎక్కువున్నట్లు సమాచారం. మొన్నటి వరకూ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ నుండి పోటీ చేయటానికి నేదురుమల్లి గట్టి ప్రయత్నాలు చేసుకున్నాట్లు ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వెంకటగిరి నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో టిక్కెట్టు కోసం నేదురుమల్లి గట్టిగా పోటీ పడతున్నట్లు జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు.
అయితే, తాజాగా పార్టీలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే వ్యూహం ప్రకారమే విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర సందర్భంగా నేదురుమల్లి వైసిపిలో చేరినట్లు చెబుతున్నారు. తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కూడా 2004లో విశాఖ నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అసలు విశాఖ లోక్ సభ స్ధానంలో నాన్ లోకల్ నేతలే ఎక్కువసార్లు గెలిచారట. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి కూడా స్ధానికేతరులే. కాబట్టి అదే కోవలో రామ్ కుమార్ రెడ్డి కూడా తండ్రి వారసత్వాన్ని కంటిన్యు చేసే ఉద్దేశ్యంలో విశాఖపట్నం లోక్ సభపై కన్నేసినట్లు సమాచారం. అందుకు జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారట.
అవటానికి రామ్ కుమార్ రెడ్డిది నెల్లూరు జిల్లానే అయినా విశాఖపట్నంతో కూడా గట్టి సంబంధాలే ఉన్నాయి. రెగ్యులర్ గా రామ్ కుమార్ విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాబట్టి విశాఖపట్నంతో నేదురుమల్లికి మంచి సంబంధాలే ఉన్నాయట. ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకునే రామ్ కుమార్ ప్రత్యేకంగా విశాఖపట్నం పాదయాత్రలోనే చేరినట్లు చెబుతున్నారు. కాబట్టి పరిస్ధితులన్నీ సానుకూలమైతే విశాఖపట్నం లోక్ సభ నుండి రామ్ కుమార్ పోటీ చేయటం ఖాయమనే అంటున్నారు.