మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలాకా అది. జనం వెల్లువలా తరలివచ్చారు. అక్కడ మీటింగ్ పెట్టింది ఎవరో కాదు. పాదయాత్రతో ఏపీని చుట్టుముడుతున్న జన నాయకుదు జగన్. మంత్రి గారు పాలిస్తున్న నేల మీద నిలబడి ఏం చెబుతారో అని ఉత్సాహపడిన వారందరినీ నిరాశ పరచకుండా జగన్ తన స్పీచ్ లో మాటల తూటాలే పేల్చారు. గంటాను ఏకంగా ఊసరవెల్లితో పోల్చారు. భూకబ్జాలకు భీమిలీ కేరాఫ్ అడ్రస్ అని కడిగిపారేశారు.
ఇదేనా పాలన :
ప్రతి ఎన్నికకూ ఓ కొత్త నియోజకవర్గం, అలాగే కొత్త పార్టీ.. రాజకీయల్లో ఊసరవెల్లిని తలపించారు మంత్రి గంటా అంటూ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. భీమిలీ నియోజకవర్గంలో జగన్ గంటాపై వేసిన సెటైర్లకు మంచి స్పందన లభించింది. ఆయన ఇచ్చిన హామీలను నమ్మి జనం ఓటేస్తే ఒక్కటైనా తీర్చారా.. ఇదేనా పాలన అంటూ జగన్ అటాక్ చేశారు.
వియ్యంకుల ఏలుబడిలో విద్య :
ఏపీలో ప్రభుత్వ విధ్య పేదలకు అందనంత ఎత్తుకు పోయిందని, ఆ ఘనత అచ్చంగా వియ్యంకులదేనని జగన్ ఆరోపించారు. ఫీజులను బాదుదే బాదుడుగా పెంచేసుకునేందుకు విద్యా మంత్రి గంటా వియ్యంకుడు నారాయణకు పర్మిషన్ ఇచ్చేశారని సెటైర్లు వేశారు. నారాయణ కాలేజీల్లో 38 విద్యార్ధులు చనిపోతే మంత్రిగా గంటా తీసుకున్న చర్యలేంటని జగన్ నిలదీశారు. కార్పోరేట్ చదువు పేరుతో దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
కబ్జాల భీమిలి :
నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కబ్జాలే కనిపిస్తున్నాయని జగన్ మండిపడ్డారు. దోచుకవడానికి ప్రభుత్వ, పేదల భూములే దొరికాయా అంటూ ప్రశ్నించారు. అసైండ్ లాండ్ కూడా లాగేసుకున్నారని ఇదేనా మంత్రి గారి నిర్వాకం అంటూ జగన్ అటాక్ చేశారు. లాండ్ పూలింగ్ అంటూ మరో వైపు భూములను అందిన కాడికి చుట్టేశారని అన్నారు. గంటా అనుచరులు ఇలా భూములను కబ్జా చేస్తూంటే మంత్రిగారు ఏం చేస్తున్నారని జగన్ గద్దించారు.
హామీల సంగతేంటి :
చిట్టివలస జ్యూట్ మిల్లును నెల రోజులలో తెరిపిస్తానని చెప్పిన పెద్ద మనిషి గంటా అని, ఇప్పటికీ ఏళ్ళకు ఏళ్ళుగా మిల్లు తాళాలతో ఉందని ఎద్దేవా చేశారు. తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ అన్నారని, జనం చెవిలో పూవులు పెట్టారని జగన్ సెటైర్లు వేశారు. బాబు అవినీతి పనులకు గంటా అంబాసిడర్ గా మరిపోయారని, అంతే తప్ప అభివ్రుధ్ధి మాత్రం ఎక్కడా లేదని జగన్ నిందించారు. మొత్తానికి మంత్రి గంటా ఇలాకాలో జగన్ పేల్చిన మాటల బాంబులు బాగానే పేలాయి.