పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైంది. చింతమనేని అంటే రాష్ట్రంలో తెలియనివారుండరు. ఎందుకంటే, ఎక్కడలేని వివాదాలను చింతమనేని నెత్తినపెట్టుకునే తిరుగుతుంటారు మరి. వివాదాలు ముందు పుట్టి తర్వాత చింతమనేని పుట్టారని టిడిపి నేతలు సరదాగా అంటుంటారు. అంతటి ఘనచరిత్ర కలిగిన చింతమనేనిపై తాజాగా ఏలూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయటం గమనార్హం.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఐఎంఎల్ డిపోలో హమాలీ కార్మిక సంఘం మేస్త్రీగా రాచేటి జాన్ పనిచేస్తున్నాడు.గోడౌన్లో సరిగా పని చేయటం లేదన్న కారణంగా అతిడిని పనిలో నుండి తీసేశారు. ఆ విషయాన్ని ఆ కార్మికుడు ఎంఎల్ఏ చింతమనేనితో ఫిర్యాదు చేశారు. దాంతో ఎంఎల్ఏ జోక్యం చేసుకున్నారు. వెంటనే జాన్ ను పిలిపించి మాట్లాడరు. తొలగించిన కార్మికుడిని వెంటనే పనిలో పెట్టుకోవాలని ఆర్డర్ వేశారు.
అయితే, ఎంఎల్ఏ మాటను జాన్ లెక్క చేయలేదు. దాంతో చింతమనేనికి కోపం వచ్చి దాడి చేసి కొట్టాడు. అదే విషయాన్ని జాన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దాంతో రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు, దళిత సంఘాలు ఆందోళన మొదలుపెట్టాయి. ఆందోళన ఫలితంగా పోలీసులు ఒత్తిడికి లొంగక తప్పలేదు. చిరవకు ఏలూరు త్రిటౌన్ పోలీసులు చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విషయ ఏమిటంటే, చింతమనేనికి వివాదాలు కొత్తా కాదు. కేసులు కొత్తా కాదు. అసలు చింతమనేని రాజకీయ జీవితం మొదలైంది ఏలూరు రౌడీ షీటర్ కేసుతో అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదవ్వటం బహుశా ఇదే మొదటిసారేమో.