ధర్మాబాద్ కోర్టు చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత మినహాయింపు కోరుతు, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు రీకాల్ కోరుతూ చంద్రబాబు తరపున లాయర్లు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. కోర్టు ముందు అందరూ సమానమేనని కాబట్టి ఎవరికీ వ్యక్తగత మినహాయింపు ఇవ్వటం సాధ్యం కాదంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు బుర్ర తిరిగిపోయింది. అక్టోబర్ 15వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసిన కోర్టు ఆరోజు చంద్రబాబు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందేనంటూ ఆదేశించటంతో టిడిపిలో టెన్షన్ మొదలైంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, బాబ్లి ప్రాజెక్టు సైట్ లోకి అనుమతి లేకుండానే చంద్రబాబు అండ్ కో 2010లో ఎంటరయ్యారు. దాంతో మహారాష్ట్ర పోలీసులు వారిని అడ్డుకున్నారు. అపుడు పెద్ద రచ్చే జరిగింది. ఆ రచ్చలో పోలీసులు దొరికిన టిడిపి నేతలను దొరికినట్లు ఉతికి ఆరేశారు. చంద్రబాబుతో పాటు మరో 15 మందిని అరెస్టు కూడా చేశారు. కేసును కోర్టుకు పంపేసి అరెస్టు చేసిన వారందరినీ మూడు రోజుల తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.
ఆ తర్వాత కేసు గురించి అందరూ మరచిపోయారు. తెలంగాణాలో ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి కూడా ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దాంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. వారెంటుతో టెన్షన్ పడ్డ చంద్రబాబు న్యాయవాదులతో సంప్రదించారు. నిజానికి ఈరోజు వాయిదాకు చంద్రబాబు హాజరవ్వాల్సుంది. ముందు హాజరవ్వాలని అనుకున్నా చివరి నిముషంలో తన తరపున లాయర్లను పంపాలని నిర్ణయించుకున్నారు.
కోర్టుకు హాజరైన చంద్రబాబు లాయర్లు పిటీషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో చంద్రబాబుకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును ఉససంహరించుకోవాలంటూ లాయర్లు పిటీషన్లో పేర్కొన్నారు. అయితే, రెండు పిటీషన్లను కోర్టు కొట్టేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని, వచ్చే నెల 15వ తేదీన కేసు విచారణకు హాజరవ్వాల్సిందేనంటూ ఆదేశించింది. నాన్ బెయిలబుల్ ఆరెస్టు వారెంటు పై అప్పడే నిర్ణయం తీసుకుంటామని చెప్పటంతో టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ఇదే కేసుపై ఈరోజు విచారణకు హాజరైన గంగుల కమాలకర్, ప్రకాష్ రెడ్డి, కెఎస్ రత్నంకు కోర్టు బెయిలిచ్చింది.