ఉత్తరాంధ్ర టీడీపీకి పెట్టని కోట.  ఆ పార్టీలో దశాబ్దాల రాజకీయం చేసిన సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. ఇపుడు కంచుకోటల్లోకి కొత్త రాజకీయం ఎంటరైతే కౌంటరీయకుండా ఉంటారా. విజయనగరం జిల్లాలో ఇపుడు జరుగుతున్నది ఇదే. కూల్ జిల్లా కాస్తా ఒక్కసారిగా ఇపుడు హీటెక్కుతోంది. మాటల దాడులతో అట్టుడుకుతోంది. ఫ్లెక్సీల యుధ్ధానికి తెర లేచింది.


టీడీపీ అలెర్ట్ :


విజయనగరం జిల్లాలోకి జగన్ ఈ రోజు పాదం మోపుతున్నారు. దాంతో టీడీపీ అలెర్ట్ అయిపోయింది. జగన్ వైపు జనం మూడ్ మళ్ళకుండా
ఉండేందుకు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేసింది. శ్రుంగవరపు కోట మీద నుంచి జగన్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. దాంతో అక్కడ జగన్, బొత్స సత్యనారాయణ అవినీతికి సంబంధించి ఫ్లెక్సీలతో ఓ రేంజిలో రివర్స్ ప్రచారం మొదలెట్టేసింది. దాంతో ఎస్ కోట రాజకీయ రణ క్షేత్రమైపోయింది.ఇలా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విజయనగరం జిల్లాలో అడుగుపెట్టినప్పుడు గట్టి ఝలక్‌ ఇవ్వడానికి టీడీపీ సమాయత్తమైంది. 


బండారం బయటేస్తాం :


జగన్‌, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణల అవినీతి, అక్రమాలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ఫ్లెక్సీలుగా ఎస్ కోట  ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఏర్పాటుచేశారు. వీటితో పాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌లపై బొత్స వ్యాఖ్యలను కూడా పొందుపరిచారు. వీటిని చూసేందుకు  కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌గజపతిరాజు ఎస్‌.కోట వచ్చారు. పాదయాత్రలో నీతికబుర్లు చెబుతున్న వైసీపీ నేతల బండారం జనానికి తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలో వైసీపీ పప్పులు ఉడకవన్నారు.


మీటింగ్ పెట్టి మరీ :


ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల ముందే విజయనగరం జిల్లా నేతలతో మీటింగ్ పెట్టి మరీ పాదయాత్రపై అలెర్ట్ చేశారు. ఎట్టి పరిస్తితుల్లో మైలేజ్ జగన్ కి దక్కకుండా చూడాలని ఆదేశించారు. దీంతో అశోక్ గజపతిరాజు, మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా కౌంటర్ అటాక్ చేస్తూ రెడీ అయిపోయారు. మరి వైసీపీ మరో వైపు మోహరించి ఉన్న వేళ జిల్లా రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: