ఎంఎల్ఏ చనిపోయిన తర్వాత మెల్లిగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంఎల్ఏ మృతికి కారణాలపై టిడిపి వర్గాలతో పాటు గిరిజన నేతలు కూడా బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపటానికి చంద్రబాబునాయుడే పరోక్షంగా కారణమంటూ మండిపోతున్నారు.
ఎలాగంటే, మావోయిస్టులు తనను టార్గెట్ గా చేసుకున్న విషయం కిడారికి బాగా తెలుసు. ఇప్పటికే ఆ విషయంపై మావోయిస్టుల నుండి పలుమార్లు హెచ్చరికలను కూడా అందుకున్నారు. అందుకనే నియోజకవర్గంలో తిరగటం బాగా తగ్గించేశారట. ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. ఇంకోవైపు తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏమంత బావోలేదు. అందుకనే మొత్తం ప్రజా ప్రతినిధులను నియోజకవర్గాల్లో తిరగాలంటూ చంద్రబాబు ఆదేశించారు. ఆ విషయమే ఇపుడు కిడారి కొంపముంచేసింది.
ఎప్పుడైతే చంద్రబాబు నుండి ఆదేశాలు వచ్చాయో వెంటనే ఎంఎల్ఏ కలిసారట. నియోజకవర్గంలో తిరిగితే తనకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించారట. అయితే ఆ కారణాలను చంద్రబాబు కొట్టిపారేశారని సమాచారం. ప్రతీ ఒక్కరూ పార్టీ కార్యక్రమాలను ప్రజాల్లోకి తీసుకెళ్ళాల్సిందేనంటూ గట్టిగా చెప్పారు. అదే సమయంలో పార్టీ తరపున గ్రామదర్శిని అనే ప్రోగ్రామ్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఆ కార్యక్రమానికే కిడారి హాజరయ్యారు.
గ్రామదర్శిని కార్యక్రమానికి ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమ హాజరవుతున్న విషయం మావోయిస్టులకు ఉప్పందింది. దాంతో పక్కా ప్లాన్ చేసి ఇద్దరిని పట్టుకుని కాల్చి చంపేశారు. సరే, ఈ విషయాన్ని పక్కనబెడితే మావోయిస్టుల నుండి అంత ప్రాణహాని ఉందని తెలుసుకున్న రేపటి ఎన్నికల్లో మాత్రం ఎలా పోటీ చేయాలని అనుకున్నారు ? ఓట్ల కోసం నియోజకవర్గంలో తిరిగే సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మావోయిస్టులకు దొరకాల్సిందే కదా ?
ఇపుడిదే విషయంలో టిడిపిలోని గిరిజన నేతలు, ఫిరాయింపు నేతలు ఆందోళన పడుతున్నారు. పాడేరు ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి పరిస్ధితేంటనే విషయంలో ఇపుడందరూ చర్చించుకుంటున్నారు. ఆమె కూడా వైసిపిలో ఉన్నపుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఇపుడు ప్రభుత్వంతో కలిసిపోయిన విషయం తెలిసిందే.