ప్రభుత్వంపై ప్రజలు తిరగబడితే ఎలాగుంటుందో చూస్తారా ? అంటూ చంద్రబాబునాయుడుకు పవన్ చాలా ఘాటుగా హెచ్చరించారు. పార్టీ ఎంఎల్ఏలను క్రమశిక్షణలో పెట్టుకోలేకపోతే త్వరలోనే చంద్రబాబు ప్రజల తిరుగుబాటును ఎదుర్కోవాల్సుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అంతగా చంద్రబాబును పవన్ హెచ్చరించాల్సిన అవసరం ఏమొచ్చింది ?
ఏమొచ్చిందంటే, ఈమధ్యనే దెందులూరు నియోజకవర్గంలో హమాలీ కూలీని పనిలో పెట్టుకునే వ్యవహారంలో ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఒక మేస్ట్రీని కొట్టారు. ఆ మేస్త్రీ ఎంఎల్ఏపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సరే చివరకు కోర్టు ద్వారా ఎంఎల్ఏపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయంచారనుకోండి అది వేరే సంగతి. అదే మేస్త్రీ ఈరోజు పవన్ పర్యటన సందర్భంగా ఎంఎల్ఏ వల్ల తనకు జరిగిన అవమానాన్ని వివరించారు.
ఆ విషయంపైనే చంద్రబాబుపై పవన్ మండిపడ్డారు. చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు ధ్వజమెత్తారు. గతంలో కూడా ప్రభుత్వ అధికారులను కొట్టటం, అమ్మనాబూతులు తిట్టటం చింతమనేనికి మామూలే. ఏదో సినిమాలో విలన్ చెప్పినట్లు తిడితే తిట్టిచ్చుకోవాలి..కొడితే కొట్టిచ్చుకోవలన్నట్లు తయారైంది దెందులూరులో చింతమనేని వ్యవహారం. చింతమనేనిపై ఉన్న 38 కేసులను పవన్ ప్రస్తావించారు. ఎంఎల్ఏలను చంద్రబాబు క్రమశిక్షణలో పెట్టుకోలేకపోతే ఆ బాధ్యతను ప్రజలే తీసుకోవాల్సి వస్తుందంటూ పవన్ చేసిన హెచ్చరికలు సర్వత్రా చర్చకు దారితీశాయి. అయినా చింతమనేని వ్యవహారం చంద్రబాబుకు కొత్తా ?