రాజకీయాల్లో అందరూ నీతులు చెబుతుంటారు. కానీ వ్యవహారాలు మాత్రం అలా ఉండవు. కోట్లలో డబ్బు ఖర్చు చేస్తేనే పాలిటిక్స్ సాగేది. అది అందరికీ తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయాలు వ్యాపారం అయిపోయాయి. పదవి కోసం ముందు ఖర్చు చేయడం.. ఆనక పదవి పట్టేశాక పోయిన సొమ్మును రాబట్టుకోవడం. ఇదే నయా ట్రెండ్. మరి దీనికి భిన్నంగా జరిగేది ఉందా
చెక్ చెబుతారా :
జనసేనాని పవన్ కళ్యాన్ ఈ టైప్ రాజకీయాలకు చెక్ చెబుతానని అంటున్నారు. రాజకీయల్లో డబ్బు ప్రమేయం ఉండరాదన్నదే తన విధానమని ఆయన ప్రకటించారు. ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని పార్టీని నడపడం రాజకీయాలు చేయడం తన వల్ల కాదని పవన్ అంటున్నారు. అలా చేయలేకనే పార్టీని నాలుగేళ్ళైనా నిర్మించుకోలేకపోయానని చెప్పుకొచ్చారు.
సెటైర్లు వేసారుగా :
డబ్బు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చేసి. వాళ్ళకే పార్టీలో పెద్ద పీట వేసేసి చేసే రాజకీయానికి తాను దూరమని పవన్ అంటున్నారు. అలే కనుక చేస్తే తనకు ఇతర పార్టీలకూ తేడా ఏముంటుందని ప్రశ్నించారు. తన కుటుంబం నుంచో, బంధువుల నుంచో నాయకులను తెచ్చేసి ఇదే పార్టీ అని తాను చెప్పనని కూడ సెటైర్లు వేశారు. కుటుంబ తరహా పార్టీలకు, అవినీతి రాజకీయాలకు తాను వ్యతిరేకమని పవన్ అంటున్నారు.
జనమే ఇవ్వాలి :
తన పార్టీకి జనమే స్వచ్చందంగా విరాళాలు ఇవ్వాలని పవన్ పిలుపు ఇచ్చారు. అలా సామాన్యున్ని వచ్చిన సొమ్ముతోనే పార్టీని నడుపుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. సామాన్యుడు కూడా నాయకుడు కాగలిగేదే అసలైన రాజకీయమని పవన్ అంటున్నారు. మరి పవన్ చెప్పేది బాగానే ఉంది కానీ పార్టీల కంటే ప్రజలే బాగా ముదిరిపోయారే. పైసా లేకుంటే ఓటు వేయనని అంటున్న వ్యవస్థలో పవన్ చెప్పే మాటలు ఎంతవరకు ఆచరణ సాధ్యమని చూడాలి.
మొత్తానికి చాలా కాలానికి బయటకు వచ్చి మాట్లాడిన పవన్ తన పార్టీ నిర్మాణాంపై వస్తున్న విమర్శలకు గట్టి జవాబు చెబుతూనే ఇతర పార్టీలను కుటుంబ, అవినీతి పార్టీలుగా తేల్చేశారు.