నిజంగా చంద్రబాబునాయుడే లేకపోతే భారతీయ జనతా పార్టీ నేతలు ఏమైపోయుండే వారో ? పొద్దున లేచ్చిందగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకూ బిజెపి నేతలకు చంద్రబాబే కేంద్ర బిందువు. చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చేయకపోతే వాళ్ళకు నిద్రరాదన్నట్లుగా తయారైంది పరిస్ధితి. గడచిన నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి భారీ ఎత్తున జరిగిందన్నది వాస్తవం. తన వాళ్ళకు దోచిపెట్టటానికి వీలుగా అన్నీ వ్యవస్ధలను చంద్రబాబు నిర్వీర్యం చేసేశారు.
పట్టిసీమ, పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను, నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం. ఇలా పథకమేదైనా సరే ముందుగా అవినీతి తర్వాత అభివృద్ధి అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. పైగా రాష్ట్రంలో అమలవతున్న చాలా పథకాల్లో కేంద్రం నిధులే ఎక్కువ. దాంతో కేంద్రం ఇస్తున్న నిధులన్నింటినీ చంద్రబాబు దుర్వనియోగం చేస్తున్నారంటూ మండిపోతున్నారు. చంద్రబాబు అవినీతికి తమ వద్ద ఆధారాలున్నాయని కూడా ప్రతీరోజు మీడియా ముందు ఊదరగొడుతూనే ఉంటారు.
నిజంగానే చంద్రబాబు అవినీతిపై తమ వద్ద ఆధారాలే ఉంటే మరెందుకు విచారణ చేయించటం లేదు ? కేంద్రప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నది కూడా తమ పార్టీనే కదా ? మరి అటువంటపుడు కేంద్రమంత్రులకు ఫిర్యాదులు చేసో లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఆధారాలను అందించో వెంటనే విచారణ చేయిస్తే సరిపోతుంది కదా ? ఆ పనులు చేయకుండా కేవలం మీడియా ముందు మాత్రమే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే జనాలు హర్షిస్తారా ? వచ్చే ఎన్నికల్లో ఓట్లేసేస్తారా ?