ముందస్తు ఎన్నికల నేపధ్యంలో బలమైన కాంగ్రెస్ నేతలపై పాత కేసులను తిరగదోడి పోలీసులు చికాకులు పెడుతున్నారు. ఈరోజు ఉదయం నుండి తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్ళపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. పాత కేసులను తవ్వి తీసి మరీ దాడులు చేయటం గమనార్హం. రేవంత్ పై రెండు కేసులున్నాయి. మొదటిది ఎప్పుడో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న కేసుంది. దానికితోడు ఓటుకు నోట్లు కేసు ఎలాగూ నమోదైఉంది. అయితే ఈ రెండింటిలో ఏ కేసుకు సంబంధించి రేవత్ పై ఈడి అధికారులు తాజాగా దాడులు చేశారన్న విషయం తెలియటం లేదు.
ఈరోజు తెల్లవారుజామునే ఈడి అధికారులు రేవంత్ కు చెందిన హైదరాబాద్ లో ఇంటితో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ ఇంటిపైన కూడా దాడులు చేశారు. రేవంత్ ఇళ్ళతో పాటు ఆయన బంధువుల ఇళ్ళపైన కూడా దాడులు జరుగుతుండటం గమనార్హం. ఎప్పుడైతే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుండే పలువురు కాంగ్రెస్ నేతలు ఇటువంటి దాడులను అనుమానిస్తునే ఉన్నారు. అందులో భాగంగానే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించటం. కూన వెంకటేష్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. వరంగల్ జిల్లాలోని గండ్ర వెంకటరమణారెడ్డిపై తుపాకి దుర్వినియోగం చేసిన కేసు నమోదు చేశారు. దాదాపు 20 ఏళ్ళనాటి జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటి అవకతవకల కేసులో రేవంత్ కు నోటీసులు ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే కొందరు నేతలపై కెసిఆర్ గురిపెట్టినట్లే ఉన్నారు.
ఇక, తాజా దాడల విషయం చూస్తే హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో ఈడి అధికారులు దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఈడి అధికారులు దాడులు చేశారంటేనే ఓటుకునోటు కేసులో అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, తెలంగాణాలో ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటు కొనుగోలు బేరం చేసుకున్న రూ. 5 కోట్లలో రేవంత్ రెడ్డే స్వయంగా రూ. 50 లక్షలు ఇచ్చారు. డబ్బులు ఇచ్చేటపుడే స్వయంగా ఏసిబి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇచ్చిన రూ. 50 లక్షలకు గాని, బేరం కుదుర్చుకున్న రూ. 5 కోట్లకు గాని రేవంత్ ఇప్పటి వరకూ లెక్కలు చెప్పలేదు. ఆ విషయంపైనే ఈడి అధికారులు దాడులు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదే నిజమైతే ఓటుకునోటు కేసు చంద్రబాబునాయుడు మెడకు కూడా చుట్టుకుంటుందనటంలో సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి