అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందంటూ అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోయిన ఆదివారం అరకు ఎఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో అసెంబ్లీ స్ధాన ఖాళీ అయ్యిందంటూ అసెంబ్లీ సెక్రటేరియట్ ఎన్నికల సంఘానికి అధికారపూర్వకంగా తెలియజేసింది. ఎన్నికల కమీషన్ అధికారులు అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ కు పంపారు.
పోయిన ఎన్నికల తర్వాత ఒక అసెంబ్లీ స్ధానం ఖాళీ అవ్వటం ఇదే మొదటిసారి. వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలు తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించినా వారెవరూ రాజీనామాలు చేయలేదు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని చట్టంలో లేదు కానీ అది నైతికతకు సంబంధించిన విషయం. వారందరికీ నిజంగా నైతికతే ఉండుంటే అసలు ఫిరాయించేవారే కాదు.
పార్టీ ఫిరాయింపులన్నది ప్రజా ప్రతినిధుల ఇష్టమనంటలో సందేహం లేదు. కానీ ఒక పార్టీ టిక్కెట్టుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించటంతోనే సమస్య వస్తోంది. నిజంగానే వైసిపి తరపున ఎంఎల్ఏలు, ఎంపిలు నిజంగానే నైతికత ఫీలై తమ పదవులకు రాజీనామాలు చేసుంటే చాలా అసెంబ్లీ, మూడు లోక్ సభ స్ధానాలకు ఉప ఎన్నికలు వచ్చుండాలి. ఫిరాయింపు ఎంఎల్ఏల్లో మావోయిస్టుల తుపాకి బలైపోయిన కిడారి సర్వేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయన మావోయిస్టుల చేతిలో మరణించారు కాబట్టే అసెంబ్లీ సెక్రటేరియట్ నియోజకవర్గం ఖాళీ అంటూ ఎన్నికల కమీషన్ కు పంపింది. మరి కేంద్ర ఎన్నికల కమీషన్ ఉప ఎన్నికపై ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.