అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లాలోని అరకు నియోజకవర్గం పర్యటనకు వెళుతున్నారు. పోయిన ఆదివారం మావోయిస్టల చేతిలో హత్యకు గురైన ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమ కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు అరకు వెళుతున్నారు.
గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో వారి వాహనాన్ని అడ్డుకున్న మావోయిస్టులు ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏలను కారులో నుండి దింపారు. తర్వాత వారిని స్ధానిక గిరిజనుల సమక్షంలోనే పార్టీ ఫిరాయింపు, మైనింగ్, కార్లు కొనుగోలు లాంటి అనేక విషయాలపై విచారించి తుపాకితో కాల్చి చంపేశారు. ఆ ఘటన జరిగినపుడు చంద్రబాబు అమెరికాలో ఉన్నారు. నారా లోకేష్ కూడా అందుబాటులో లేరు.
ఘటన జరిగిన వెంటనే ప్రముఖులెవరూ లిపిటుపుట్టు వెళ్ళటానికి సాహసించలేరు. ఘటన మధ్యాహ్నం జరిగితే పోలీసు ఉన్నతాధికారులు కూడా సాయంత్రానికి కాని వెళ్ళలేకపోయారంటేనే అక్కడి పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏ హత్య విషయం బయటకు పొక్కగానే మరో ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి ఒక్కరే వెళ్ళారు.
ఘటన జరిగినప్పటి నుండి పోలీసులు మొత్తం ఏజెన్సీ ఏరియానంతా మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఆచూకీ కోసం ఒడిస్సా రాష్ట్రం సరిహద్దుల్లో నుండి కూడా గ్రేహౌండ్స దళాలు గాలింపు చర్యలకు దిగారు. ఒక విధంగా రెండు రాష్ట్రాల పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ జరుపుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కావటం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లో చంద్రబాబు అరకుకు వెళతుండటంతో అంతటా టెన్షన్ మొదలైది.