ప్రతీ అంశంలోను చంద్రబాబునాయుడు సొంత లాభమే చూసుకుంటారు. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తాజాగా మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివెరి సోమ కుటుంబాల పరామర్శలోను అదే జరిగింది. రెండు కుటుంబాలపైన చంద్రబాబు ఎనలేని ప్రేమ కురిపించేశారు. వైసిపి తరపున గెలిచిన కిడారిని ప్రలోభాలకు గురిచేసి తెలుగుదేశంపార్టీలోకి లాక్కోవటంతోనే కిడారి హత్య జరిగిందన్నది బహిరంగ రహస్యం.
పార్టీ మారటానికి కిడారికి మంత్రి పదవి హమీతో పాటు రూ. 12 కోట్లు ఇచ్చారట. అలాగే, మైనింగ్ లైసెన్సులు కూడా ఇచ్చారట. ట్రైకార్ సంస్ధ ద్వారా రెండు కార్లు కొనుక్కోవటానికి ఎంఎల్ఏకి సబ్సిడీపై రుణం కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఇదంతా కూడా ఫిరాయించినందుకు చంద్రబాబు ఇచ్చిన నజరానా అన్నమాట. ఈ విషయాన్ని స్వయంగా కిడారే మావోయిస్టులకు ప్రజాకోర్టులో చెప్పారంటే నిజమనే అనుకోవాలి. అభివృద్ధిని చూసి పార్టీ మారినట్లు ఫిరాయింపులు చెప్పిందంతా అబద్దమని తేలిపోయింది.
సరే, ఈ విషయాలను పక్కనపెడితే ఈరోజు ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. కిడారి కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు చాలా వరాలే ఇచ్చేశారు. కుటుంబానికి ప్రభుత్వం నుండి కోటి రూపాయలట. మళ్ళీ కుటుంబంలోని నలుగురు సభ్యులకు తలా రూ. 5 లక్షలట. కుటుంబానికి కోటి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ 5 లక్షలేంటో అర్ధం కావటం లేదు. ఇది కాకుండా పార్టీ తరపున తలా రూ. 5 లక్షలట. సరే, పార్టీ డబ్బులు కాబట్టి అది వాళ్ళిష్టమనుకోండి. రెండో కొడుక్కి గ్రూప్ 1 ఉద్యోగం. విశాఖనగరంలో ఇంటి స్ధలం. పెద్ద కొడుకు విషయం పార్టీలో చర్చించి ఏమి చేయాలో నిర్ణయిస్తారట.
ఇక, సోమ కుటుంబంలోని సభ్యులకు ప్రభుత్వం నుండి తలా పది లక్షల రూపాయలట. రెండో కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం, మళ్ళీ ప్రభుత్వం నుండి కుటుంబంలోని ఏడుగురికి తలా రూ. 10 లక్షలు, పార్టీ నుండి తలా రూ. 5 లక్షలు, విశాఖపట్నంలో ఇంటి స్ధలం, అరకులో నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తవ్వటానికి సాయం. ఇదంతా ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏలు చనిపోయింది కేవలం చంద్రబాబు ప్రలోభాల వల్లే అన్నది స్పష్టం.
కిడారి టిడిపిలోకి ఫిరాయించకుండా ఉండుంటే హత్యకు గురయ్యేవాడు కాదేమో ? వాస్తవాలిలా ఉండగా రెండు కుటుంబాలపైన ఇంతలా వరాలు గుప్పించటం వెనుక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది అర్ధమైపోతోంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున ఒక్క గిరిజనుడు కూడా గెలవలేదు. కనీసం ఒచ్చే ఎన్నికల్లో అయినా గిరిజనుల ఓట్లను కొల్లగొట్టచ్చన్న ఉద్దేశ్యం మాత్రమే కనబడుతోంది చంద్రబాబు ప్రకటనలో.