తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వ్యవహారంపై మాట్లాడాలంటేనే చంద్రబాబునాయుడు భయపడిపోతున్నట్లున్నారు. అమెరికా నుండి వచ్చిన తర్వాత వెంటనే విశాఖపట్నం జిల్లాలో అరకు వెళ్ళి వెచ్చారు. తర్వాత రాత్రి మీడియాతో మాట్లాడారు. రేవంత్ విషయం ప్రస్తావించినపుడు ఆయన ముఖ కవళికలు మారిపోయాయి. నేరుగా రేవంత్ వ్యవహారం మాట్లాడటానికి చంద్రబాబు ఇష్టపడలేదు.
రేవంత్ విషయం మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడలేదంటే అసలు విషయం ఓటుకునోటు కేసే కాబట్టి. ఓటుకునోటు కేసంటే దేశానికంతా తెలుసు అసలు సూత్రదారి ఎవరో ? రేవంత్ గురించి మాట్లాడాలంటే ముందు ఆ కేసు గురించే ప్రస్తావించాలి. ఆ తర్వాత మనీల్యాండరింగ్, అక్రమాస్తులు తదితరాలపై స్పందించాలి. అయితే, ఏ కేసు గురించి ప్రస్తావిస్తే ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. మామూలుగానే ఏ విషయంలోనూ సూటిగా మాట్లాడే అలవాటు లేని చంద్రబాబు ప్రస్తుత రేవంత్ పరిస్ధితిమీద మాట్లాడుతారని అనుకోవటం కూడా అత్యాసే.
రేవంత్ ఇంటిపై జరిగిన దాడుల గురించి అడిగినపుడు నేరస్ధులను, దొంగలను పట్టుకోకుండా సమర్ధవంతంగా పనిచేసేవారిపైనే దాడి చేస్తారంటూ మండిపడ్డారు. ఇక్కడ దొంగలెవరు ? నేరస్ధులెవరో ? చెప్పకుండా సమర్ధులపైనే దాడులు చేస్తారనటంలో అర్ధమే లేదు. పైగా తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగిందో ఇక్కడా అదే చేస్తున్నారంటూ ఇన్ డైరెక్టుగానే మాట్టాడారు. బిజెపి విధానాలు మొదటి నుండి ఇలాగే ఉన్నాయంటూనే నాలుగేళ్ళుగా బిజెపి కక్షసాధింపులకే దిగుతున్నట్లు వ్యాఖ్యానించటం గమనార్హం. నాలుగేళ్ళుగా బిజెపి కక్షసాధింపులకు పాల్పడుతుంటే మరి కలిసి ఎలా కాపురం చేశారు ? మరి వైసిపి నేతల విషయంలో ఏపిలో చంద్రబాబు చేస్తున్నదేంటో ?
కేంద్రప్రభుత్వం, నరేంద్రమోడి పనితీరుపై మాట్లాడుతూ మళ్ళీ ఆవు కథే వినిపించారు. కేంద్రం సక్రమంగా పనిచేయటం లేదని, మోడి జూనియర్ అని చెప్పిందే చెప్పటం. విదేశాల్లో మోడి ఎందుకు తిరుగుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదట. అన్ని దేశాలు తిరిగిన మోడి భారత్ కు ఏమి సాధించారని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. మరే అదే ప్రశ్న తనకు కూడా వర్తిస్తుందని మరచిపోయినట్లున్నారు.
ఏదేమైనా రేవంత్ గురించన్నా, తెలంగాణాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన స్పందించాలంటేనే చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం అర్దమైపోతోంది. అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ పై విచారణ తనపైన ఎక్కడ పడుతుందో అన్న భయమే చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలపై ఎవరు కూడా నోరుమెదపవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారట. ఇప్పుడే ఇంతగా భయపడుతున్న చంద్రబాబు రేపటి రోజున తెలంగాణా ఎన్నికల్లో అసలు ప్రచారానికి వచ్చే అవకాశాలే కనబడటం లేదు.