తెలంగాణా రాష్ట్ర సమతి తాజా మాజీ ఎంఎల్ఏ బాబూమోహన్ టిఆర్ఎస్ చీఫ్, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు పెద్ద షాకే ఇచ్చారు. ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళిన బాబూ మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలోనే కెసిఆర్ 105 మంది అభ్యర్ధులను ప్రకటించారు. ఆ జాబితాలో ఆంథోల్ నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ బాబుమోహన్ పేరు లేదు. టి్క్కెట్టు ఇవ్వటం కూడా సాధ్యం కాదని కెసిఆర్ స్ఫష్టం చేశారు.
దాంతో బాబుమోహన్ ప్రత్యామ్నాయంగా బిజెపిని ఎంచుకున్నారు. బిజెపి తెలంగాణా అధ్యక్షుడు లక్ష్మణ్ తో చర్చలు జరిపి టిక్కెట్టుపై హామీ తీసుకున్న తర్వాత ఆయనతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో కమలం కండువా కప్పుకున్నారు. ఆంథోల్ లో టిక్కెట్టు కేటాయించే విషయంలో అమిత్ షా హామీ ఇచ్చారట.
ఎప్పుడైతే బాబుమోహన్ కు కెసిఆర్ టిక్కెట్టు నిరాకరించారో అప్పటి నుండి తాజా మాజీ ఎంఎల్ఏలో అసంతృప్తి మొదలైంది. ఆ విషయం ఆ నోటా ఈ నోటా బిజెపి లక్ష్మణ్ కు చేరటంతో గాలమేశారు. బిజెపి నేతలు బుజ్జగించి బాబుమోహన్ కమలంపార్టీలో చేరేట్లు ఒప్పించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో బిజెపికి ఏమీ బలం లేదన్న విషయం తెలిసిందే. బాబుమోహన్ పేరుతో కమలం పార్టీకి కాసిని ఓట్లు తెచ్చుకుంటే అదే పదివేలన్నట్లుంది పరిస్దితి.