జగన్ పాదయాత్ర ఉభయ గోదావరి జిల్లాలను కలిపే బ్రిడ్జి మీద జగన్ కోసం వచ్చిన జనసందోహం మామూలు విషయం కాదు. రెండు జిల్లాలకూ వారధిగా వున్న 'రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి'పై ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా జగన్ వెంట జనం పోటెత్తారు. కింద గోదారి.. పైన జనసంద్రం.. వెరసి, ఇదొక అద్భుతంగా చరిత్రకెక్కింది. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనంత జనం.. ఈ సందర్భంగా గోదారిపై కన్పించారు.
ఇప్పుడు ఆ జన గోదారి.. జన సంద్రాన్ని మించి.. జనసేన పార్టీ కార్యకర్తలు 'షో' చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో 'జనసేన పోరాటయాత్ర' పేరుతో పవన్ హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. 'జనసేన కవాతు' పేరుతో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై జనసంద్రాన్ని చూపించాలనీ.. అదీ ప్రజాసంకల్ప యాత్రను మించిన జనసందోహాన్ని సమీకరించాలనీ జనసేన శ్రేణులు ప్రయత్నాల్లో తలమునకలైపోయాయి.
సినీ నటుడిగా పవన్కళ్యాణ్కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీలేదు. అయితే, జగన్ నిర్వహించిన 'ప్రజాసంకల్పం' పోరాటయాత్రకు మించిన జనసందోహాన్ని నడిపించడమంటే చిన్న విషయమేమీ కాదు. బ్రిడ్జిపైన మాత్రమేకాదు, బ్రిడ్జి పొడవునా, గోదావరి నదిలో పడవలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ అద్భుతాన్నే సృష్టించింది. అయినా, పవన్కళ్యాణ్ కావొచ్చు.. జనసేన పార్టీ స్థానిక నేతలు కావొచ్చు.. ఈ 'పోటీ'కి ఎందుకు తెరలేపారన్నది అర్థంకాని ప్రశ్న. పవన్కళ్యాణ్ కోసం జనం వస్తారు. ఆయనకు సినీ నటుడిగా వున్న ఫాలోయింగ్ అలాంటిది. ఒకవేళ జనసేన ప్రయత్నాలు ఏ కారణంగా అయినా బెడిసికొడితే పరిస్థితి ఏంటట.? అత్యంత జాగ్రత్తగా బ్రిడ్జి మీద జనాన్ని మేనేజ్ చేయాల్సి వుంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా.. అంతే సంగతులు. జరిగే నష్టం చాలా దారుణంగా వుంటుంది.