సాధారణంగా రోడ్డు పై ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించిన ఉండాలని రూల్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రమాదం జరిగితే..తలకు దెబ్బ తగలకుండా రక్షణగా ఉంటుందని దాని ఉద్దేశం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠిన చట్టాలే తీసుకు వచ్చింది. ఒకవేళ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే..జరిమానా కూడా విధిస్తారు. అయితే కేరళాలో మాత్రం ఓ విచిత్రం చోటు చేసుకుంది..అది కాస్త వైరల్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
కేరళలోని కసర్గోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. ఆ యువకుడు షాక్ తిన్నాడు..అదేంటీ నేను నడుపుతుంది సైకిల్ కదా..అని ప్రశ్నించినా..అతనిపై లాఠీ ఎత్తడంతో తన వద్ద అంద డబ్బు లేదని రూ.500 మాత్రమే ఉన్నాయని అనడంతో రూ.500 లకు ఛలానా రాసి ఇచ్చారు.
అంతే కాదు ఆ సైకిల్ గాలి కూడా తీసి వేశారు. అయితే ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో అవాక్కైన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఖాసీం కి విధించిన జరిమానా గురించి వీడియోలో వైరల్ కావడంతో విషయం ఎస్పీ వరకు చేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు.