ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా జరుగుతున్న దాడులు కేంద్రం రాష్ట్రంపై చేస్తున్న కక్షసాధింపు చర్యలు అని పేర్కొన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి దాడులు జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా రాష్ట్రంలో 19 బృందాలతో పాటు 200 మంది సిబ్బంది రాష్ట్రంలో మోహరింపజేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు తీయాలని చూస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీపై ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఈ విషయం గురించే మంత్రివర్గ సమావేశంలో చర్చించామని తెలిపారు.
గతంలో ఐటీ దాడులు జరిగినా తాము స్పందించలేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిపై దాడులు జరపడం వారిని బయపెట్టడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం కాదా? అని లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వస్తారని తెలుగుదేశం పార్టీ నేతలతో సీరియస్ గా మాట్లాడారట మంత్రి నారా లోకేష్. అయితే ఈ క్రమంలో మరో పక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తప్పూ చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని..నిజంగా ధైర్యం ఉంటే ఐటీ దాడులను ఎదుర్కోవాలని సవాళ్లు చేస్తున్నారు.