తెలంగాణా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్
పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో కాంగ్రెస్
మొదటి జాబితాలను విడుదల చేసిన విషయం
తెలిసిందే. అయితే, రెండో విడతకు సంబంధించి మరో 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేయటానికి పిసిసి నుండి ఢిల్లీకి రెండో
జాబితా వెళ్ళింది. ఆ జాబితాలోనే రేవంత్ పెద్ద షాక్ తగిలింది. రేవంత్ కు అత్యంత
సన్నిహితులైన వారి పేర్లు జాబితాలో గల్లంతైపోయాయి. మరికొందరికి నియోజకవర్గాలు
మారాలని సూచిస్తున్నాయి.
రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు జాబితాలో గల్లంతయ్యింది. నరేందర్ వరంగల్ వెస్ట్ నియోజకర్గం నుండి పోటీకి సిద్దపడ్డారు. అలాగే, ఇదే జిల్లాలో ములుగు లో పోటీకి సీతక్క రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆమెకు భద్రాచలంలో పోటీ చేయమని పార్టీ చెప్పింది. రేవంత్ తో పాటు తెలుగుదేశంపార్టీ నుండి సుమారు 15 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో ఎంతమందికి టిక్కెట్లు హామీ ఇచ్చిందో తెలీదు కానీ వేం నరేందర్ రెడ్డి, సీతక్క లాంటి అతి ముఖ్యులకు మాత్రం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టిక్కెట్టు హమీ ఇచ్చిందని రేవంత్ చెప్పారు. టిక్కెట్ల హామీతోనే చాలామంది రేవంత్ తో పాటు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
ముందస్తు ఎన్నికల వేడి బాగా రాజుకున్ననేపధ్యంలో టిక్కెట్ల విషయంలో రేవంత్ వర్గానికి కాంగ్రెస్ షాక్ ఇవ్వటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నేరేందర్, సీతక్కలు పోటీ చేయాల్సిన నియోజకవర్గాల్లో వేరే పేర్లను పిసిసి కమిటి సిఫారసు చేయటం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ జాబితాలో వారికే టిక్కెట్లు ఖరారవుతాయని చెప్పేందుకు లేదుకానీ అనవసర రాద్దాంతమైతే రేగుతుంది. ప్రస్తుతం జాబితాలో పేర్లు లేని వారంతా రేవంత్ తో భేటీ అవ్వటంతో పార్టీలో ఏమవుతోందో అర్ధంకాక పలువురు నేతలు ఆందోళన మొదలైంది.