ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. తండ్రి పేరు కూడా చాలా ఘనమే. అటువంటి కుటుంబం నుంచి వారసత్వం తీసుకుని వచ్చిన ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా బాగానే రాణించారు. కాంగ్రెస్ విభజన పాపానికి ఏపీలో బలి అయిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. ఇపుడు ఆయన కొత్త రాజకీయం మొదలెడుతున్నారు.
కాంగ్రెస్ కి గుడ్ బై :
సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. రెండు పర్యాయాలు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి తరువాత సమర్ధవంతంగా పనిచేశారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది.అంటువంటి ఆయన అకస్మాత్తుగా కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. ఈ రోజు ఆ విషయాన్ని మీడియాకు అధికారికంగా ప్రకటించారు.
జనసేనానితో :
మనోహర్ కాంగ్రెస్ నుంచి జనసేన వైపు వెళ్తున్నారు. తన భవిష్యత్తు రాజకీయాన్ని చూచాయగా మీడియాకు చెప్పేసిన మనోహర్ ఈ రోజు తిరుమల వెళ్తానని పేర్కొన్నారు. అక్కడ పవన్ తో కలసి రేపు (శుక్రవారం) శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత తన పార్టీ చేరికని అధికారికంగా చెబుతానని వెల్లడించారు. అక్కడ ఇద్దరు నేతలు ఒక్కటి అవుతారన్న మాట.
ప్లస్ అవుతుందా :
మనోహర్ జనసేనలో చేరడం ఆ పార్టీకి ప్లస్ అవుతుందా అన్న విశ్లేషనలు మొదలయ్యాయి. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారన్నది తప్ప మాస్ లీడర్ కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ తో సెయిల్ అయి గెలిచిన వారిలో ఆయన కూడా ఒకరు. పార్టీ బేస్డ్ పాలిటిక్స్ చేయడం తప్ప సొంతంగా జనాల్లో పలుకుబడి లేదంటున్నారు. అయితే సీనియర్ నాయకునిగా కొత్త పార్టీకి బూస్టప్ ఇవ్వగలరు. జనసేనలో ఆ కొరతను తీర్చగలరు. వ్యూహాలను కూడా రూపొందించే విషయంలో సలహాలు ఇవ్వగలరు.
మొత్తానికి జనసేనకు గట్టి నాయకులు లేరన్న విమర్శలకు కొంత వరకు మనోహర్ రూపంలో చెక్ పడగలదని అంటునారు. అదే టైంలో ఏపీలో ఎగబాకాలని చూస్తున్న కాంగ్రెస్ కి ఇదొక దెబ్బగా చూడాలి. ఆ పార్టీని జనం నమ్మడం అటుంచి నాయకులే విశ్వాసంలోకి తీసుకోవడంలేదనడానికి మనోహర్ విషయం ఓ ఉదాహరణ