నాలుగు రోజుల క్రితం మాస పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకోగా, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు 8 మంది మాత్రమే దేవుడిని దర్శించే ప్రయత్నం చేశారని, వారిలో ఒక్కరు కూడా స్వామిని ప్రత్యక్షంగా చూడలేదని ఆయల వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆదివారం ఉదయం శబరిమలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పంబ సమీపంలో అడ్డుకున్న వసంతి (41), ఆదిశేషి (42)లు తెలుగువారే కావడం గమనార్హం. పంబ బేస్ క్యాంప్ నుంచి శబరిమలకు బయలుదేరగా, గణపతి ఆలయానికి 200 మీటర్ల దూరంలోనే వారిని భక్తులు అడ్డుకున్నారు. అయితే తమకు శబరిమలలో పరిస్థితి గురించి తెలియకపోవడంతోనే దర్శనానికి వచ్చినట్టు వారు పేర్కొన్నారు.
శుక్రవారం నాడు హైదరాబాద్కు చెందిన మహిళా జర్నలిస్ట్ కవిత, ముస్లిం యువతి రెహానాలు దాదాపు 300 మంది పోలీసుల భద్రత నడుమ ఆలయం సమీపానికి వెళ్లినా, స్వామిని మాత్రం దర్శించుకోలేకపోయారు. మొదటి నుంచి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పును అనుసరించి పలువురు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే, ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారు వెనుదిగారు. మరోవైపు ఈ రోజు రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసుకోనున్నాయి.
ఐదు రోజుల పాటు నెలవారీ పూజలు నిర్వహించిన అర్చకులు ఆలయాన్ని మూసివేయనున్నారు. నాలుగు రోజుల క్రితం మాస పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకున్న విషయం తెలిసిందే. నేడు ఆలయద్వారాలు మూసివేయనున్నారు. తిరిగి నవంబర్ మూడవ వారంలో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈరోజు చివరి రోజు కావడంతో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. శబరిమల, పంబ బేస్, నీలక్కల్ ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.