జగన్ మీద జరిగిన దాడి గురించి పలు అనుమానాలను వైసీపీ నాయకులూ, అలాగే తమ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ దీనిని ఒక చిన్న ఘటన గా కొట్టి పారేస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద నిన్న జరిగిన హత్యాయత్నంపై చంద్రబాబు సర్కార్, పోలీసుల ద్వారా చెప్పిస్తున్న కథలు, సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. తెలుగు మీడియాని మేగ్జిమమ్ చంద్రబాబు అండ్ టీమ్ తమ కనుసన్నల్లో 'మేనేజ్' చేస్తున్నా, సోషల్ మీడియాని మేనేజ్ చేయడం కుదరదు కదా.! సోషల్ మీడియాలో నెటిజన్లు కడిగి పారేస్తున్నారు.. ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే 'కత్తి పోటు' వ్యవహారానికి సోషల్ మీడియాలో పోస్ట్ మార్టమ్ జరిగిపోతోంది.
వైఎస్ జగన్ మీద హత్యాయత్నం చేసిన వ్యక్తిని వైఎస్సార్సీపీ అభిమానిగా చెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ సర్కార్. కానీ, నిందితుడు టీడీపీ కండువా బుజాన వేసుకున్న ఫొటోని 'నెటిజన్లు' వెలికి తీశారు. నిందితుడి చేతిలో 11 పేజీ లేఖ వుందని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లేఖ నిండా వైసీపీ భావజాలమే కన్పించిందట. కానీ, ఆ లేఖలో రాత కాదు, రాతలున్నాయనీ.. ఒక చేతిరాతకీ ఇంకో చేతిరాతకీ సంబంధం లేదని నెటిజన్లు ప్రశ్నించారు. దానికి మళ్ళీ ఇంకో సమాధానమొచ్చింది.. ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో నిందితుడు ఆ లేఖ రాయించాడట. ఇదేమన్నా వినడానికి సబబుగా అన్పిస్తోందా.? అదే మరి, చంద్రన్న నీతి అంటే.!
కత్తి గాటు కేవలం అర సెంటీమీటరు మాత్రమేనని చంద్రబాబు ప్రకటించేశారు.. అక్కడికేదో ఆయన ఆ గాయాన్ని స్వయంగా చూసినట్లు. మరోపక్క, ఆ 'అర సెంటీమీటర్' వ్యవహారానికి సంబంధించి డాక్టర్ ధృవీకరణనూ సోషల్ మీడియాలో వదిలారు. వైద్య చికిత్స అందించిన హైద్రాబాద్ డాక్టర్లు మాత్రం, మూడు నుంచి 4 సెంటీమీటర్ల గాయం అయ్యిందనీ, గాయం లోతు ఎక్కువగా వుందనీ తేల్చారు. దానికి మళ్ళీ ఇంకో కథ టీడీపీ సిద్ధం చేసింది.