నాగ చైతన్య నటించిన సినిమా సవ్యసాచి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్' అనే కాన్సెప్ట్కి సంబంధించిన రీసెర్చ్, ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇచ్చినా అది నిజంగా కథలో రోల్ ప్లే చేసే సన్నివేశమే వుండదు. యాడ్ ఫిలింస్ బ్యాక్డ్రాప్లో కామెడీ అనుకుని ఏదో చేస్తూ అటునుంచి అటే హీరో తాలూకు లవ్స్టోరీకి సంబంధించిన ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లి అక్కడ కూడా 'కామెడీ లాంటిదేదో' చేస్తూ కాలక్షేపం చేసి, అటు లవ్స్టోరీని కానీ, ఇటు హ్యూమర్ని కానీ పండించకుండా... కేవలం అసలు కథని ఇంటర్వెల్ దగ్గర మొదలు పెట్టడానికి కాలక్షేపం చేస్తున్నారనే సంగతి ఎలుగెత్తి చాటుకుంటారు.
కాలేజ్ నుంచి యుఎస్కి షిఫ్ట్ చేసినా కానీ ఆ లవ్స్టోరీ రక్తి కట్టించకపోగా తెగ విసిగిస్తుంది. దానికితోడు షకలక శంకర్తో 'మన్మథుడు'లో బ్రహ్మానందం కామెడీ చేయించేస్తున్నామని ఫీలవడం మరింత ఇరిటేట్ చేస్తుంది. అత్యంత పాయింట్లెస్గా, అసలు కథకి సంబంధం లేకుండా ఒక గంటకి పైగా తినేసిన తర్వాత విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఇతనిదో (మాధవన్) విచిత్ర కథ. తనని చిన్ననాటి నుంచి అవమానాలకి గురిచేసి, తన మేథస్సుని గుర్తించని వారందరినీ కలిపి మూకుమ్మడిగా చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు.
అందరినీ చంపినా ఒక్కడు (నాగ చైతన్య) మిస్ అవుతాడు. అతను ఇతడిని ఎందుకు టార్గెట్ చేసాడు, అతని ఉచ్చునుంచి ఈ సవ్యసాచి ఎలా తప్పించుకుంటాడు? మాధవన్ పాత్ర చుట్టూ కథ నడుస్తున్నపుడు అతని పాత్రకి తగిన బ్యాక్గ్రౌండ్ చూపించి తీరాలి. అతను ఎందుకలా మారాడనే దానికి తగిన ఎక్స్ప్లెనేషన్ వుండాలి. ఏవో నాలుగు మాటలు చెప్పేసి అతనితో కనక్ట్ అయిపోండి, అతని పగలో భాగం కండి అంటే ఎలా కుదురుతుంది? అంత వృధాగా ఎందుకూ కొరగాని ప్రేమకథపై అన్నిరోజులు, అన్ని కోట్లు ధారబోసినపుడు కథకి అతి కీలకమైన ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ని తేలిగ్గా తీసుకుంటారా? వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటూ హీరో ఎడమ చేతికి అత్యంత బలం వుందనే బిల్డప్ బాగుంది. కానీ ఆ ఎడమ చెయ్యి ఈ కథలో పోషించిన పాత్ర ఏమిటనేది ఒక్కసారి తరచి చూసుకుంటే... అది లేకుండా కూడా ఈ సినిమాని ఇదే విధంగా తీసే వీలుంది.