ఆ మద్య మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతడి భార్య అమృత ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందా ? ఆమెను కూడా అంతమొదించేందుకు పథకం పన్నుతున్నారా ? అమృత నివసించే ఇంటి వద్ద రెక్కీ జరిగిందా ? నిజమేనంటోంది అమృత. తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, ఆపై మాట్లాడుతూ, ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పిన ఆమె, వారు కిందకు వచ్చేలోపే ఆగంతకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది.
మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ నెలన్నర క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృత, తల్లితో కలిసి వెళుతున్న అతడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రణయ్ ను కిరాయి హంతకుడితో హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయ్ తో పాటు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ప్రణయ్ తల్లిదండ్రులను బెదిరించి అమృతను తమ వైపు తిప్పుకోవాలని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని..అమృత ఆరోపిస్తుంది.
ఈ నేపథ్యంలో తమ ఇంటికి అగంతకుడు వచ్చాడని..ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్ ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని చెప్పింది. ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతకుడు చాలా బలంగా కనిపించాడని అమృత వెల్లడించింది.
ఇదే సమయంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ..తనను చంపి అమృతను తీసుకు వెళ్లాలని కుట్ర జరుగుతుందని..పోలీసులు తమకు రక్షణ కల్పించాలని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకు అందించామని, తమ ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని గుర్తించి, శిక్షించాలని పోలీసులను కోరుతున్నామని అన్నారు.