ఈ మద్య వైవాహిక సంబంధాల్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తడంతో కొంత మంది విడాకులు తీసుకుంటే..మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నా రు. ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీలకు వరకు సాగుతున్న తంతే. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన భార్యకు విడాకులు కోరుతూ తేజ్ ప్రతాప్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. నవీన పోకడలు ఉన్న ఐశ్వర్యతో తనకు పొసగడం లేదని.. పెళ్లి తర్వాత జీవితం చాలా కష్టంగా గడుస్తోందంటూ విడాకుల దరఖాస్తులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు లాలూ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అవేవీ తేజ్ ప్రతాప్ యాదవ్ నచ్చలేదని సమాచారం...అంతే కాదు తనపై కుటుంబ సభ్యులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ హోటల్ నుంచి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..జార్ఖండ్ రాజధాని రాంచీలో జైల్లో ఉన్న తన తండ్రిని నిన్న ఆయన పరామర్శించారు.
ఆ తర్వాత రాంచీ నుంచి బీహార్ రాజధాని పాట్నాకు బయల్దేరారు. మార్గమధ్యంలో బుద్ధగయలో ఓ హోటల్ లో నిన్న రాత్రి బస చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో ఫోన్లో టచ్లోనే ఉన్నారు. కాగా తమతో మాట్లాడిన అనంతరం తేజ్ ప్రతాప్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని అతడి భద్రతా సిబ్బంది తెలిపారు.
ఎంతసేపటికి ఆయన తలుపు తెరవకపోవడంతో తమ వద్ద ఉన్న వేరొక కీతో రూం తెరచి చూడగా.. వెనుక డోర్ నుంచి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని వృందావన్ కు ఆయన వెళ్లినట్టు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై లాలూ కుటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించలేదు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.