జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి టీడీపీ మంత్రుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రతిపాడు మండలం వంతాడలో వేల కోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదిలావుండగా తాజాగా విజయవాడ లో జనసేన పార్టీ సమావేశంలో మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వంతాడలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమ మైనింగ్ వల్ల సామాన్యులకు నీళ్లు దొరికే పరిస్థితి కూడా లేక పోయిందని మండిపడ్డారు, టీడీపీ సర్కార్ మాత్రం అక్కడ ఏమీ జరగనట్టుగా కలరింగులు ఇస్తుందని...ఇక రిజర్వు అటవీ ప్రాంతం అయినప్పటికీ.. విచక్షణా రహితంగా కొండలను తవ్వేశారని, వాస్తవానికి చెట్లు కూడా నరకడానికి వీల్లేని చోట.. చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందని పవన్ ప్రశ్నించారు.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుమతించి తప్పు చేస్తే.. నేడు భారీగా అక్రమ మైనింగ్ చేస్తున్న వారితో చేతులు కలిపి చంద్రబాబు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీ పార్టీలో ఇటూ టిడిపి పార్టీలో కలకలం సృష్టించాయి.